ఖమ్మం, ఫిబ్రవరి 9 : రైతుల పంట భూములకు నష్టం కలిగించే విధంగా ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్పాడ్ వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ను తక్షణమే రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో బాధిత రైతు ప్రతినిధులు వల్లూరి పట్టాభి, బానోత్ చంద్రావతి, గుర్రం రాముతో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో ఎకువగా దళిత, గిరిజన, పేద రైతులకు చెందిన సాగు భూములు ఉన్నాయని, వారికి అవే ఆధారమని, ఆ భూములు కోల్పోతే జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని విన్నవించారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర.. ప్రతిపాదిత లైన్కు ప్రత్యామ్నాయంగా మరో మూడు మార్గాల గురించి మంత్రికి సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను కచ్చితంగా పరిశీలించి.. రైతులకు నష్టం జరగకుండా చూస్తానని, ప్రస్తుత సర్వే పనులను నిలుపుదల చేసేలా తక్షణమే ఆదేశాలు ఇస్తానని రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే గార్ల రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలపై ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంలను విస్తరించాలని, స్టేషన్లో డిస్ ప్లే బోర్డులు పెట్టాలని, శాతవాహన, ఇంటర్ సిటీ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. వీటిపై కూడా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.