ఖమ్మం, జూలై 2 : రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని, బయ్యారంలో ఉకు కర్మాగారాన్ని నెలకొల్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాజ్యసభలో తెలుగులో చకగా మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి బీఆర్ఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. తెలంగాణ ఏర్పడిన స్వల్పకాలంలోనే గొప్పగా అభివృద్ధి చెందిన తీరును పార్లమెంట్ సాక్షిగా సవివరంగా ఆవిషరించారు. 18వ లోక్సభ కొత్తగా కొలువుదీరిన సందర్భంగా తనను రాజ్యసభకు రెండోసారి పంపిన కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 11నుంచి 5వ స్థానానికి రావడం అభినందనీయమన్నారు. ఈ విధంగా దేశం మరింత బలోపేతం కావాలని ఆశిస్తున్నానని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి నిజంగా ఒక స్వర్ణయుగమని అన్నారు. కేసీఆర్ పాలనలో అమలు చేసిన బృహత్తర పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలు సాగులోకి తీసుకువచ్చారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్ జిల్లాలోని కొంతభాగం సాగులోకి వచ్చేలా ప్రతిష్టాత్మకంగా సీతారామ ప్రాజెక్టు పనులను 90శాతం పూర్తి చేశారన్నారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ వారం కిందట విజయవంతమైందన్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 11లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయని తెలిపారు.