ఖమ్మం, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అయితే తమ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టును నిర్మించినట్లు కాంగ్రెస్ జిల్లా మంత్రులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని పార్టీ కార్యాలయం(తెలంగాణభవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలైనా కాకముందే ప్రాజెక్టును పూర్తిచేసినట్లు జిల్లా మంత్రులు ఫోజులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టుకు నిధులిచ్చి పనులను పూర్తి చేయించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను యాభై ఏం డ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఖమ్మంజిల్లాలో ఒక్క ప్రాజెక్టునైనా నిర్మించిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మంజిల్లాలో కేవలం తొమ్మిదినెలల్లోనే ‘భక్తరామదాసు’ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పాలేరు నియోజకవర్గంలోని 72వేల ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని జిల్లా రైతులు ఎప్పటికీ మర్చిపోరన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కోట్ల రూపాయలను కేటాయించి ‘సీతారామ’కు 2017లో శంకుస్థాపన చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. రూ.13 వేల కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో కట్టారో భట్టి సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి కృషిచేసిన జిల్లా ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, సహకరించిన ప్రజలకు బీఆర్ఎస్ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన మంత్రులు ఈ రోజు న ప్రాజెక్టు ట్రయల్ రన్ ముందు గొప్పలు చెబుతున్నారని అన్నారు. సీతారామ, భక్తరామదాసు ద్వారా ఉమ్మడి ఖమ్మంజిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఖమ్మం నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడేందుకు మున్నేరు నదికి ఇరువైపుల వాల్ను నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.600 కోట్లను కేటాయించి ఎల్అండ్టీ కంపెనీకి పనులు అప్పగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాంట్రాక్టును రద్దు చేసి కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అనుచరులైన పటేల్ కంపెనీకి అప్పగించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని మధు ప్రశ్నించారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జోక్యం చేసుకోవద్దని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది నిజంకాదా అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హా మీని అమలుచేయ చేతగాని కాంగ్రెస్ ప్రభు త్వం కాలయాపన చేసేందుకే రోజుకొక కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నదని విమర్శించారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తప్ప రైతులకు రుణమాఫీ, రైతుబంధు, పింఛన్ల పెం పు లాంటి హామీలను అమలు చేయలేక పో తున్నదన్నారు. కేసీఆర్ గత పదేండ్ల కాలం లో అమలుచేసిన ఏ ఒక్క పథకాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారని అన్నారు. రైతుబంధు పేరు మార్చి రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తానన్న రేవంత్ ఇప్పటివరకు రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలలో ఒక్క డీఏను కూడా ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలు పూర్తి చేస్తే వారందరికీ తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు వారితో మీటింగ్లు పెట్టడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని, బీఆర్ఎస్ మాత్రమే అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, తెలంగాణ ఉద్యమకారులు బిచ్చాల తిరుమలరావు, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రాంమ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, సతీష్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు తాజుద్దీన్, బీఆర్ఎస్ ఖమ్మంరూరల్ అధ్యక్షుడు బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు.