అశ్వాపురం, జూన్ 27 : సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని.. రైతులు రెండు, మూడు పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకం మొదటి దశ పంప్హౌస్ ట్రయల్ రన్ను గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లోనే వైరా రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను పారిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కుమ్మరిగూడెం వద్ద నుంచి తొమ్మిది కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా బీజీ కొత్తూరు పంప్హౌస్ వరకు చేరనున్న గోదావరి జలాలు ఎత్తిపోతల ద్వారా ఒక్కసారిగా పరవళ్లు తొక్కడంతో చూపరులకు కనువిందు చేసింది. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.