కొత్తగూడెం టౌన్, జూలై 1 : తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఈ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చదివి నిరుద్యోగులైన వారు 2,450 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వారికి ఇంటర్యూలు నిర్వహించారు. ఈ జాబ్మేళాలో సుమారు 60 ప్రముఖ కంపెనీల్లో 603మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 928 మందిని తర్వాత ఇంటర్యూకి ఎంపిక చేశారు. మొత్తం 1,531 మందిని జాబ్మేళాలో ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఉపాధి కల్పన అధికారి విజేత, యువజన క్రీడల అధికారి సంజీవరావు, సిబ్బంది ఉదయ్కుమార్, తిరుమలరావు, లక్ష్మయ్య పాల్గొన్నారు.