మణుగూరు టౌన్, జూన్ 27 : ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని సంకల్పించి సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి పూనుకున్న ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల ఉమ్మడి జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ కట్టాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించినా.. అనేక కేసులు పెట్టి ఆటంకం కలిగించారని ఆయన గుర్తు చేశారు. అయిప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అన్ని అనుమతులు మంజూరు చేయించారని, 90 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదటిసారి డ్రై రన్ నిర్వహించామని గుర్తు చేసిన ఆయన సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ సహా మొత్తం పంప్హౌస్ల పని పూర్తయిందన్నారు.
లింక్ కెనాల్ను పూర్తిచేసి ప్రాజెక్ట్ను సమర్థవంతంగా వినియోగించుకుంటే 6,75,000 పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఒకపక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తూనే.. మరోవైపు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రాజెక్ట్ పనులను నిలిపివేయడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య కాంగ్రెస్ కార్యకర్త తెల్లం నరేశ్తో కోర్టులో కేసు వేయించారని గుర్తు చేశారు. గురువారం జిల్లా పర్యటనకు ముగ్గురు మంత్రులు వచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. తట్టెడు మట్టి పోయనోళ్లు.. దమ్ముంటే సీతారామ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూపాయి ఖర్చు పెట్టకుండా స్విచ్ ఆన్ చేసిన మంత్రి తుమ్మల ‘నా కల నెరవేరింది’ అని చిలక పలుకులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దమ్ముం టే ప్రాజెక్ట్ పూర్తి చేయండి అంటూ ఆయన జిల్లా ప్రజల పక్షాన డిమాండ్ చేశారు.