తిరుమలాయపాలెం, జూలై 2: ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పంటల సాగు కోసం గోదావరి జలాలను అందించే సీతారామ ప్రాజెక్టు కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు ప్రాంతాల్లో జరుగుతున్న సీతారామ – పాలేరు లింక్ కెనాల్ సొరంగ మార్గ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు మొదటి లిఫ్టులో వెట్ రన్ ట్రయల్ను ఇటీవల పూర్తి వేశామని అన్నారు. హెడ్ రీచ్లో పనులు పూర్తయినప్పటికీ టెయిల్పాండ్ అయిన పాలేరు వరకు సాగునీరు రావడానికి మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మెయిన్ కెనాల్ తవ్వకానికి టెండర్లు కాలేదని అన్నారు.
యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలిచి ఆయా పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న జిల్లాలోని 1.55 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్ ఆయకట్టును, ఇతర మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆయకట్టును స్థిరీకరించేందుకు రూ.100 కోట్లతో ఓ లింక్ కెనాల్ను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ లింక్ కెనాల్ను ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్లో డ్రాప్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, పనుల్లో నాణ్యతా లోపాన్ని గుర్తించిన మంత్రి పొంగులేటి.. ఇరిగేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బోడ మంగీలాల్, బెల్లం శ్రీనివాసరావు, రామకృష్ణ, శేషాద్రి, బానాల రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.