ఖమ్మం, జూన్ 28 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పం, అవిరళ కృషితోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల జల సంకల్పం నెరవేరిందని, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని లక్షలాది ఎకరాల భూములు ప్రాజెక్టు నీటితో సస్యశ్యామలమవుతాయని, ఏళ్లనాటి అన్నదాతల కల సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పూర్తి చేశారని, కరువును పారదోలే కల్పతరువుగా ప్రాజెక్టును నిర్మించారని, ఈ ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. మొదటి దశ పంపుహౌస్ ద్వారా గోదావరి జలాలు ఊరూరా పరుగులు తీస్తూ లక్షలాది ఎకరాలకు చేరుతాయన్నారు. దీనిని జిల్లా రైతాంగానికి అంకితం చేస్తున్నామని పేరొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కూడా అభినందిస్తున్నట్లు నామా తెలిపారు.
కొత్తగూడెం టౌన్, జూన్ 28 : కొత్తగూడెంలో శనివారం జరగాల్సిన మెగా జాబ్మేళాను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1వ తేదీన కొత్తగూడెం క్లబ్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మేళాలో పాల్గొనే నిరుద్యోగ యువతీ యువకులు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, నేరుగా కూడా పాల్గొనవచ్చని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోడేటా తమ వెంట తీసుకొనిరావాలని సూచించారు.