టేకులపల్లి, జూలై 2 : రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు ప్రాజెక్టు ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అఖిలపక్ష నాయకులతో కలిసి మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హరిప్రియ, గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ నియోజకవర్గం చుట్టూ నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని, ఈ క్రమంలో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రతి ఎకరాకు నీరందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ రూ.3,200 కోట్లు మంజూరు చేసి డీపీఆర్ చేయించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య దీనిపై దృష్టి సారించి మరిన్ని నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం అనుబంధ రైతు సంఘం నాయకుడు ఏవూరి బ్రహ్మం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, సీపీఐ నాయకుడు దేవరకొండ శంకర్, పీఏసీఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్, ఇల్లెందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీబీకేఎస్ ఇల్లెందు వైస్ ప్రెసిడెంట్ జాఫర్ హుస్సేన్, వివిధ పార్టీల నాయకులు నాయిని రాజు, బుర్ర వెంకన్న, బోడ బాలు, గిన్నారపు రాజేశ్, రైతులు పాల్గొన్నారు. అనంతరం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ను అఖిలపక్ష నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి నియోజకవర్గానికి నీరు అందే వరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.