అశ్వారావుపేట/దమ్మపేట, జూన్ 27 : సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం అశ్వారావుపేట, దుమ్మపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ‘నా గుండె కాయ’ అని ఆనాడే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఈ క్రమంలో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ మదిలోంచి జాలువారిన ప్రాజెక్టు సీతారామ అని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులు మూడు పంటలు పండించుకోవచ్చని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కరువును శాశ్వతంగా పారదోలే వరప్రదాయినికి కేసీఆర్ ప్రాణం పోశారని, పరవళ్లు తొక్కే గోదావరి జలాలతో రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయని అన్నారు. కేసీఆర్ కలను సాకారం చేసే జల సంకల్ప విజయంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి మెచ్చా అభినందనలు తెలిపారు.