ఖమ్మం, జూలై 2 : రైతు బాగుంటేనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభాకర్ తండ్రి పెద్దవీరయ్యతో నామా ఫోన్లో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని కుటుంబసభ్యులను ఓదార్చారు. రైతు తనకు జరిగిన అన్యాయాన్ని అధికారాలకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ కుటుంబానికి ఆర్థికసాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని ఈ సందర్భంగా నామా గుర్తుచేశారు.