రఘునాథపాలెం/మామిళ్లగూడెం, జూలై 4: ‘నా కొడుకు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి సారూ..’ అంటూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతు ప్రభాకర్ తండ్రి బోజెడ్ల వీరభద్రయ్య ఖమ్మం కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. గడ్డం పట్టుకొని బతిమాలారు. కలెక్టర్కు వినతిపత్రం ఇస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో రైతు ప్రభాకర్ కుమార్తె, కుమారుడు కూడా కలెక్టర్కు రెండు చేతులూ జోడించి మొక్కారు. తమకు జరిగిన అన్యాయంపైనా; రైతు ప్రభాకర్ ఆత్మహత్యపైనా అతడి తండ్రి, అతడి కుమార్తె, కుమారుడు గురువారం కలిసి కలెక్టర్ను వేడుకుంటున్న తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది.
జడ్పీ చైర్మన్తో కలిసి కలెక్టరేట్కు..
తన సాగు భూమిని కొందరు ఆక్రమించడం, మత్స్య సొసైటీ బాధ్యులు జేసీబీ యంత్రాలతో వచ్చి తవ్వడం వంటి కారణాల నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చి మరీ చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతు బోజెడ్ల ప్రభాకర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో తమ న్యాయం చేయాలని కోరుతూ అతడి కుటుంబ సభ్యులు.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులతో కలిసి గురువారం ఖమ్మం కలెక్టరేట్కు వచ్చారు. పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగా తమ భూమిని తిరిగి తమకు ఇప్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను వేడుకున్నారు. అలాగే, ఆత్మహత్యకు బాధ్యులైన దోషులను కూడా కఠినంగా శిక్షించాలని విన్నవించారు. కాగా, బాధిత కుటుంబీకుల మొరపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : జడ్పీ చైర్మన్
కలెక్టర్ను కలిసి బయటకు వచ్చిన అనంతరం ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రైతు ప్రభాకర్ భూమిని చెరువులో కలిపి అతడి ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ రైతు కుటుంబంలోని పిల్లల పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటికీ పరామర్శించకపోవడం విచారకరమని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని స్పష్టం చేశారు.