భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : నవయుగ సర్ ఆర్దర్ కాటన్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి గడించారని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. గోదావరి నదిపై ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించిన స్వరాష్ట్ర ఉద్యమ సారథి.. సర్ ఆర్దర్ తరువాత అంతటి ఘనతను సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. నాడు కేసీఆర్ కష్టపడి చెమటోడ్చితే.. నేడు ట్రయల్ రన్ పేర్లతో కాంగ్రెస్ మంత్రులు చంకలు గుద్దుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ట్రయల్ రన్స్ కాంగ్రెస్ మంత్రులు వేసినప్పటికీ.. ప్రాజెక్టు నిర్మాణ ఘనత మాత్రం ముమ్మాటికీ కేసీఆర్దేనని స్పష్టం చేశారు. స్వరాష్ర్టాన్ని సాధించిన తొలినాళ్లలో ఈ ప్రాంతంలో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై ఇక్కడ సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇన్నాళ్ల ఆయన శ్రమకు ఫలితంగా ఇటీవలే ఆ ప్రాజెక్టు పూర్తయిందని అన్నారు. కానీ.. ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మూడు రోజుల క్రితం తన ముగ్గురు మంత్రులను పంపి సీతారామ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ వేయించిందని గుర్తు చేశారు.
నాడు ఇదే ప్రాజెక్టుపై అనేక విధాలుగా గగ్గోలు పెట్టిన అప్పటి కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్టు ఘనత తమదేనంటూ గొప్పలు పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మూడు రోజుల క్రితం మంత్రులు వచ్చి సీతారామ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ వేసిన నేపథ్యంలో శుక్రవారం ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ శ్రేణులు సందర్శించాయి. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. గురువారం ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పంప్హౌస్ వద్ద ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే గోదావరిపై ఇక్కడ సీతారామ ప్రాజెక్టును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో గోదావరిపై సాగునీటి ప్రాజెక్టు నిర్మించిన ఘనత సర్ ఆర్దర్ కాటన్ తరువాత కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. కానీ.. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఘనత తమదేనంటూ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసుకుంటుండడం సిగ్గుచేటని విమర్శించారు. అలాగే, ఇదే అశ్వాపురం మండలంలో మారెళ్లపాడు చెరువు అభివృద్ధికి అప్పటి సీఎం కేసీఆర్ రూ.400 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ కొత్త ప్రభుత్వం ఆ చెరువు పనులను ఎక్కడివక్కడే నిలిపివేసిందని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టు నుంచి ముందుగా భద్రాద్రి జిల్లాకే సాగునీళ్లు ఇవ్వాలని రేగా కాంతారావు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు జలాలను ఈ ఏడాదే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తామంటూ ఇటీవలి ట్రయల్ రన్ ప్రారంభంలో మంత్రులు ప్రకటిస్తుండడం అభ్యంతరకరమని అన్నారు. ఈ జిల్లాకు సాగునీళ్లు లేకుండా చేస్తే రైతులతో కలిసి అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రూపాయి పని కూడా చేయని ఇప్పటి మంత్రులు.. ఇక్కడి నీళ్లను తరలించుకు వెళ్లేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ముంతపురి రాజుగౌడ్, సూదిరెడ్డి సులక్షణ, లక్కినేని సురేందర్, కోడి అమరేందర్, పోశం నరసింహారావు, కొల్లు మల్లారెడ్డి, వట్టం రాంబాబు, కందుల కృష్ణార్జున్, వెన్న అశోక్కుమార్, మేడవరపు సుధీర్, ఈదర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.