ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 29 : ‘పోస్టులు పెంచండి మహాప్రభో..’ అంటూ నిరుద్యోగ అభ్యర్థులు నినదించారు. గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని గళమెత్తారు. ఖమ్మం జిల్లా నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు.. పోస్టులు పెంచాలన్న డిమాండ్పై నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. వందలాది మంది నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు అదనంగా పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. హామీని విస్మరించడమంటే నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని స్పష్టం చేశారు. డీఎస్సీ షెడ్యూల్ను మూడు నెలలపాటు వాయిదా వేయాలని, ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీలోనే కలపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతోపాటు ఇతర నిరుద్యోగ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు.