మధిర, జూలై 1 : మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, ఐటీ హబ్ నిర్మాణం కోసం ఇప్పటికే భూమిని గుర్తించామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క అన్నారు. సోమవారం మధిర క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. దీనికితోడు మధిర మండలం సిరిపురం సమీపంలోని యడ్లపల్లి గుట్ట వద్ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని, త్వరలోనే దీనికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులో పరిశ్రమలు పెట్టుకునే యువతకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
ట్రెడిషనల్ వ్యాపారాన్ని పారిశ్రామీకరణ చేసి.. ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ పేరున ఇందిరా డెయిరీని బోనకల్లులో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ డెయి రీ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేశామని, మళ్లీ దీని నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందిరమ్మ డెయిరీ వల్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన లభిస్తుందని, వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇక్కడి నుంచే పాల ఉత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు కలుతుందని ఆయన పేర్కొన్నారు.