భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : వరదలు ఏజెన్సీకి కొత్త కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ.. పక్కా కార్యాచరణతో వరదలను ఎదుర్కోవడం సులువేనని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్దామని సూచించారు. ‘వరదల సంసిద్ధతసహాయక చర్యల’పై భద్రాద్రి కొత్తగూడెంలోని ఐడీవోసీలో జిల్లా ఇన్చార్జి మంత్రి, మంత్రులతో కలిసి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వానకాలంలో ఏటా వచ్చే గోదావరి వరదల వల్ల జిల్లాలోని కొన్ని మండలాలకు ఎక్కువ ముప్పు ఉండేదని, అయితే ముంపు మండలాలు ఆంధ్రా పరిధిలోకి వెళ్లాక భద్రాచలం డివిజన్కు పెద్దగా ముప్పు ఉండడం లేదని అన్నారు. మరీ ఎక్కువ వరద వస్తే మొత్తంగా 111 గ్రామాలు జలదిగ్బంధంలో ఉంటాయన్నారు. భద్రాచలం పట్టణానికి ఎప్పుడూ ముంపు ఉండదని, కరకట్ట వద్ద ఉన్న స్లూయీజ్ కాలువల వల్లనే పట్టణంలోకి వరద వెళ్తుందని అన్నారు. ఇందుకోసం ముందస్తుగా గేట్లకు మరమ్మతులు చేయించుకోవాలని, మోటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. దుమ్ముగూడెం, పర్ణశాల, చర్ల, సారపాక, బూర్గంపహాడ్, మణుగూరు ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని వివరించారు. కండీషన్లో ఉన్న లాంచీలను, పడవలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలలు వరదల సమయమైనందున నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. దాదాపుగా అధికారులందరికీ వరదల సమయంలో పనిచేసిన అనుభవం ఉన్నందున ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకోకుండా అధికారులే సత్వర ఆలోచనలతో ముంపులో ఉన్న ప్రజలను సురక్షితంగా బయటకు చేర్చాలని సూచించారు. వరదలను ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అధికారులు కూడా అంకితభావంతో పనిచేయాలని, ప్రజల మన్ననలను చూరగొనాలని ఆకాంక్షించారు.
జిల్లాలో పనిచేసేవారంతా యువ అధికారులేనని ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే వచ్చిన కలెక్టర్తోపాటు ఎస్పీకి, ఐటీడీఏ పీవో, ఇతర జిల్లా అధికారులకు అపారమైన అనుభవం ఉందని అన్నారు. అందరి ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. పాలనా యంత్రాంగమంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, జారె అదినారాయణ, కోరం కనకయ్య, రాందాస్నాయక్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ మల్లన్న, ఎస్పీ రోహిత్రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఎఫ్వో కిష్టాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.