కూసుమంచి, జూలై 2: సీతారామ ప్రాజెక్టును మరో ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదావరి జలాల నిల్వకు ఎక్కడా రిజర్వాయర్ లేని కారణంగా 10 నుంచి 12 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఒక పెద్ద రిజర్వాయర్ను నిర్మిస్తామని అన్నారు. మున్నేరు నీరు వృథా కాకుండా పాలేరుకు రూ.100 కోట్లతో ఒక లింక్ కెనాల్ను నిర్మిస్తామని, శాశ్వతంగా సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ఒకటో, రెండో లిఫ్టుల ట్రయల్ రన్ కూడా పూర్తయినందున వచ్చే ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాటిని ప్రారంభిస్తారని తెలిపారు. మున్నేరు నుంచి ఏటా 35 నుంచి 40 టీఎంసీల నీరు వృథాగా పోతున్నందున 9 కి.మీ. గ్రావిటీ కాలువతో వాటిని పాలేరు రిజర్వాయర్కు మళ్లీంచేలా అంచానాలు తయారు చేశామని తెలిపారు. వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల నిర్మాణాలు, రైతులకు అందాల్సిన పరిహారం విషయాలపై అధికారులతో చర్చిస్తామన్నారు. రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని, వారికి అందాల్సిన ఫలాలను అందిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే, తమ ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే 11,062 ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు తమ పనులను శ్రద్ధతోనూ, నాణ్యతతోనూ చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. అయినప్పటికీ అధికారులు అశ్రద్ధగా ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు, వాటి పురోగతి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల నుంచి వచ్చే అర్జీలు వంటి అంశాలపై తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
కూసుమంచి మండలం పోచారంలో సీతారామ ప్రాజెక్టు కాలువ టెన్నెల్ చివరి ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.