కమాన్బజార్, జూన్ 29 : అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ.. గోబెల్స్ను మించిపోయారని, దేశ చర్రితలో ఏ ప్రధానీ చెప్పనన్ని అబద్ధాలు చెప్పిన రికార్డును సొంతం చేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అతి తకువ మెజార్టీతో గెలిచిన ప్రధానిగా కూడా ఆయన అపకీర్తిని మూటకట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా ఖమ్మంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. అభివృద్ధికి మోదీ ఏమీ గ్యారెంటీ కాదని, అతడి మాటల్లో వాస్తవికత లేకపోవడం వల్లనే బీజేపీ ఈ ఎన్నికల్లో 240 స్థానాలకు పడిపోయిందని అన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై నారాయణ స్పందించారు.
ప్రజాప్రతినిధులను చేర్చుకున్నంత మాత్రాన విపక్షం లేకుండాపోదని, అప్పుడు ప్రజలే విపక్షమవుతారన్న వాస్తవాన్ని చరిత్ర చెబుతోందని అన్నారు. పార్టీ మారే వారు ఎవరైనా సరే.. వారు అంతకుముందు ఏ పార్టీ నుంచి గెలిచి పదవిలో ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. రాజీనామా చేశాకే పార్టీ మార్పు జరగాలని స్పష్టం చేశారు. బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది సీట్లు పెరగడంపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని సూచించారు. బీజేపీ బలపడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే, తమ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో పార్టీ కార్యక్రమాలను చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, సాబీర్పాషా, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కే జానీమియా పాల్గొన్నారు.