బూర్గంపహాడ్(భద్రాచలం), ఆగస్టు 19 : అడవిలోని చెట్లూపుట్టలు, కాయకష్టాన్ని నమ్ముకుని వందేళ్లు జీవించిన ఘనత ఆదివాసీలదేనని, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేకమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అహ్మదాబాద్ నుంచి వచ్చిన ప్రొఫెసర్, సంకల్ప బృందంతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు.
మ్యూజియంలో పాతతరం వస్తువులకు సంబంధించిన అంశాలు, గిరిజనులు వాడిన వస్తువుల విధానం గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికీ కొన్ని ఆదివాసీ గూడేల్లో పాతతరం గిరిజన కుటుంబాలు ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ నేటి తరానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు. వివిధ కళారూపాలు తయారు చేస్తున్న కళాకారులను హైదరాబాద్కు పంపించి పెద్ద పెద్ద మాల్స్లో కళలకు సంబంధించిన వస్తువుల గురించి మెళకువలు తెలిపేలా అవగాహన కల్పిస్తామన్నారు.
వీరు తయారు చేసే వస్తువులు, కోయ బొమ్మలే కాకుండా ఇంట్లో అలంకారం కోసం పనికొచ్చే ప్రతి వస్తువును శాస్త్రీయపరంగా తయారు చేసి అమ్మకాలు జరిపేలా చూస్తామన్నారు. అనంతరం మ్యూజియంలో పొందుపర్చిన కళాకృతులను బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య, ఏటీడీవో అశోక్కుమార్, ఆర్ఐ నర్సింహారావు, మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి పాల్గొన్నారు.