రామవరం, జూన్ 29 : తెలంగాణలోని బొగ్గు బ్లాక్లన్నింటినీ సింగరేణి సంస్థకు నామినేటెడ్ పద్ధతిలో కేటాయించాలని టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సత్తుపల్లి, కోయగూడెం ఓసీలను ప్రైవేట్కు కేటాయించినా.. పనులు ఎవరు ప్రారంభించినా ఊరుకోమని గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్చరించడంతో ఎవరూ సాహసించలేదన్నారు. ఇప్పుడు శ్రావణపల్లి బ్లాక్ను హైదరాబాద్ కేంద్రంగా జరిగిన వేలంలో స్వయంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పాల్గొనడం సరికాదన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జూలై 1న గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి వినతిపత్రాలు అందజేస్తామని, 3న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 6న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 9న గోదావరిఖని కేంద్రంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆయా పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని, యూనియన్లకు అతీతంగా అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు కూసన వీరభద్రం, గడప రాజయ్య, కిరణ్, విజయ్, మురళి, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, అశోక్, శ్రీనివాస్, సూరజ్, గణేశ్, తిరుపతి, నరేందర్కుమార్ పాల్గొన్నారు.