మామిళ్లగూడెం, జూలై 1 : ఆదరణ కరువై, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఆపరేషన్ ముసాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను తన కార్యాలయంలో సీపీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి నెల రోజులపాటు జరిగే కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి.. వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నట్లు తెలిపారు.
గత ఏడాది నుంచి ఇప్పటివరకు 184 మంది చిన్నారులను రెస్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. బాలల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న యజమానులపై 67 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. బాలలతో బలవంతంగా భిక్షాటన, వెట్టిచాకిరీ చేయించిన వారిపై కేసులు యథావిధిగా నమోదు చేయాలన్నారు. ఈ ఆపరేషన్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్కుమార్, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సుశీల్సింగ్, ఆర్ ఐ కామరాజు, ఎస్సైలు శ్రీకాంత్, సీసీఆర్బీ ఏఎస్సై జ్యోతి పాల్గొన్నారు.