‘భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉన్నాయి. దీంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారు. మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్దుతాం. భద్రాచలవాసులకు గోదావరి వరద ముప్పు తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తాం. భద్రాద్రి రాముడిపై మా కుటుంబానికి అపార విశ్వాసం ఉంది. ఆయన ఆశీస్సులు మా పార్టీకి ఉంటాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థులు తెల్లం వెంకట్రావు, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గంలో 16వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఖమ్మం, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తమ కుటుంబం కంటే గొప్ప రామభక్తులు రాష్ట్రంలో ఎవరు లేరని, తన పేరులోనే రాముడు ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యే అభర్థులు తెల్లం వెంకట్రావు, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఆయా నియోజకవర్గకేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. తొలుత భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించి ప్రధాన సెంటర్లో మాట్లాడారు. భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉందని స్పష్టం చేశారు. ఈ కారణంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారని గుర్తుచేశారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. భద్రాచలవాసులకు గోదావరి వరద ముప్పు తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామన్నారు. ఇక్కడ ప్రజల ప్రతి సమస్య తనకు తెలుసునన్నారు. భద్రాద్రి రాముడిపై తమ కుటుంబానికి అపార విశ్వాసం ఉందని, ఆయన ఆశీస్సులు తమ పార్టీకి ఉంటాయన్నారు. కొందరు పనిగట్టుకుని మరీ భద్రాచలంపై తమ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోయినా అభివృద్ధి విషయంలో రాజీ పడలేదన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భద్రాచలం నియోజకవర్గంలో 16వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గిరిజనేతరులకూ పోడు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతుందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎన్నికల్లో ఓడించి సాగనంపితేనే గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ సాధ్యమవుతుందన్నారు. సీతమ్మసాగర్ పనులు సాగకపోవడానికి కారణం, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమని నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు కేసులు వేయడంతోనే ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగడం లేదన్నారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల బతుకులను మార్చలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మేలూ చేయదన్నారు. ప్రజలు వాళ్ల మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. ఇప్పటికే కాంగ్రెసోళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబ్బు సంచులతో తిరుగుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఓ కోల్డ్స్టోరేజీ నిర్మిస్తామన్నారు. వెంకటాపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చర్లలో డిగ్రీ కళాశాల తీసుకొస్తామన్నారు. భద్రాచలం పట్టణాన్ని మూడు గ్రామాలుగా చేయడంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందన్న సమాచారం ప్రభుత్వానికి ఉందని, తమ ప్రభుత్వం భేషజాలకు పోయే ప్రభుత్వం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు భద్రాచలాన్ని ఒక్క గ్రామ పంచాయతీగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేదా మూడు పంచాయతీలు కావాలంటే, మూడిటింనీ ఉంచుతామని స్పష్టం చేశారు. తెల్లం వెంకట్రావును గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. రైతుబంధు ఎకరానికి రూ.16 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని 93లక్షల రేషన్కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రైతుబీమా మాదిరిగానే ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా కల్పిస్తామన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీ ప్రజలందరికీ మొండిచేయి చూపిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సారపాక బీపీఎల్ స్కూల్ ప్రాంగణంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం పట్టణం చేరుకున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొన్నారు.