దుమ్ముగూడెం, జూలై 3 : నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరికి అందుబాటులో ఉంటామని, ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా కాపాడుకుంటామన్నారు. భద్రాచలం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం మండలంలోని నడికుడి మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో బుధవారం నిర్వహించారు. తొలుత సభా వేదిక వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుంచే అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని, భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో పోడుదారులకు అండగా నిలిచానని, పోడు రైతులకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేశానని గుర్తు చేశారు. మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించానని తెలిపారు. అనంతరం టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు, పర్ణశాల మాజీ సర్పంచ్ వాగే లక్ష్మీ బీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, అన్నె సత్యనారాయణమూర్తి, గంపా రాజంబాబు పాల్గొన్నారు.