పాల్వంచ, జూన్ 28 : కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నటరాజ్సెంటర్లో పెద్దఎత్తున మానవహారం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. కోలిండియా, సింగరేణి సంస్థకు బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9 రౌండ్లలో 107 బ్లాకులను వేలం వేసిందని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్నులొట్టపడ్డా బుద్ధిరాలేదని విమర్శించారు. బీజేపీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సత్తుపల్లి, కోయగూడెం ఓసీ 3 బ్లాకులని వేలం వేశారని, ఆ వేలాన్ని రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కిషన్రెడ్డి బొగ్గుగనుల శాఖ మంత్రి కాగానే దేశంలో 67 బొగ్గు బ్లాకులను రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలానికి పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, మాయమాటలు చెప్పిన బీజేపీ అధికారంలోకి రాగానే మళ్లీ దేశ ప్రజల సంపదను కొల్లగొట్టే పనిచేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, కొలగాని బ్రహ్మచారి, కారం పుల్లయ్య, ఎంబీ నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, దొడ్డా రవికుమార్, భూక్యా రమేశ్, కొండబోయిన వెంకటేశ్వర్లు, నిమ్మల వెంకన్న పాల్గొన్నారు.