అశ్వారావుపేట, జూన్ 28 : రైతులకు దీర్ఘకాలికంగా నికర ఆదాయం ఇచ్చే పంట ఆయిల్పాం సాగు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఆయిల్పాం సాగును వచ్చే ఐదేళ్లలో ఆయిల్ఫెడ్ 5 లక్షల ఎకరాల్లో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నదని, కానీ.. 10 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీని శుక్రవారం సందర్శించిన మంత్రి తుమ్మల.. నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 15వ తేదీలోగా పవర్ ప్లాంట్ను ప్రారంభించాలని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలో ఆయిల్ వినియోగం 100 మెట్రిక్ టన్నులు కాగా.. కేవలం 3.96 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ను మాత్రమే ఉత్పత్తి చేసుకుంటున్నామని, ఇంకా 97 శాతం క్రూడాయిల్ ఉత్పత్తికి అనుగుణంగా ఆయిల్పాం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లోనే ఆయిల్పాం సాగవుతుందని, ఏపీలో 5 లక్షలు, తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆయిల్పాం హబ్గా ఉండేలా విస్తరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అంతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, గతంలో కోకో ధర రూ.200 ఉంటే.. ఇప్పుడు రూ.1000 దాటిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు రైతులకు అందించేలా దృష్టి సారిస్తున్నామని, అవసరమైతే ఏపీ ఉద్యాన, వ్యవసాయ శాఖలను సమన్వయం చేసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా.. ఏపీ జనసేన నేత కరాటం రాంబాబు పూర్వ పరిచయంతో మంత్రి తుమ్మలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, ఆయిల్ఫెడ్ జీఎం టి.సుధాకర్రెడ్డి, పీఅండ్పీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, ఆయిల్ఫెడ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆలపాటి రామచంద్రప్రసాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డీసీహెచ్ఎస్లు రమణ, సూర్యనారాయణ, ఆయిల్ఫెడ్ మేనేజర్లు ఆకుల బాలకృష్ణ, భారతి, ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కల్యాణ్ తదితరులు ఉన్నారు.