పెనుబల్లి, జూన్ 30: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్.. అమెరికాలో మృతిచెందాడు. నిరుడు నవంబర్లో అమెరికాకు వెళ్లిన అతడు.. అక్కడి మిస్సోరీ స్టేట్లో శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కిరణ్ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. 8 అడుగుల లోతు ఉన్న ఆ ఈత కొలనులోకి అందరూ దిగారు. కానీ కిరణ్ పూర్తి లోతుకు వెళ్లిన కిరణ్.. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. మిగిలిన మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో వారు కూడా మునుగుతున్న కిరణ్ను చూస్తూ నిస్సాహాయులుగా ఉన్నారు. కాగా, కిరణ్ తండ్రి లక్ష్మణరాజు గతంలో చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటోంది. వీరి బాధ్యతలను కిరణ్ తాత కృష్ణమూర్తిరాజు చూస్తున్నారు. అయితే, అతడి మృతదేహం అమెరికా నుంచి స్వగ్రామమైన చిన్నకోరుకొండికు గురువారం వస్తుందని కుటుంబసభ్యులు తెలిపారు.