భద్రాచలం, జూలై 24: భద్రాచలం పట్టణంలో సోమవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని పట్టుకున్నారు. సీఐ నాగరాజ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశాల మేరకు పట్టణంలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన బొలేరో వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేశారు. వాహన సీక్రెట్ చాంబర్లో 2.80 క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయి రవాణా చేస్తున్న నిందితులను కర్ణాటకకు చెందిన ఎస్కే నదీం, రమేశ్గా గుర్తించారు. వీరు హైదరాబాద్కు చెందిన ఎండీ జహంగీర్ ఖురేషి, ఎండీ మాసుద్దీన్ నుంచి వాహనం తీసుకొని ఒడిశాలో గుండు అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు భద్రాచలం మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
కోదాడ క్రాస్ రోడ్డులో..
ఖమ్మం రూరల్, జూలై 24: మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్లో సోమవారం వాహన తనిఖీలు చేపట్టి రూ.1.50 లక్షల విలువైన గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేశ్, జిల్లా ఎక్సైజ్శాఖ అధికారి జి.నాగేందర్రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం ఏఈఎస్ వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపడుతున్నారు. క్రాస్ రోడ్డులో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తుల వద్దకు వెళ్లారు. రెండు బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన కరిష్మా మొండల్గా, మరో వ్యక్తిని ఛత్తీస్గఢ్కు చెందిన సురేశ్ బిశ్వాస్గా గుర్తించారు. వీరు ఒడిశాలోని మల్కాన్గిరిలో గంజాయి సేకరించి హైదరాబాద్ తరలిస్తూ రూరల్ మండలానికి చేరుకున్నారు. అక్కడ తమ వారికి సంబంధించిన వాహనం కోసం ఎదురుచూస్తుండగా పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్శాఖ 2 సీఆర్ రాజిరెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఇన్స్పెక్టర్ ఆర్.విజేందర్, కే పోశెట్టి, ఎస్సైలు ఎల్ అచ్చారావు, ఎం సరిత, శంకర్, సిబ్బంది నాయక్, మధు, శ్రీనివాసరావు, నాగేశ్వర్, సురేందర్, గురుప్రసాద్, విశ్వనాద్, బలరాం, హరీష్ పాల్గొన్నారు.
కొణిజర్ల శివారులో..
వైరాటౌన్, జూలై 24: ఖమ్మం డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ జి.జనార్దన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి జి.నాగేందర్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బంది ఆదివారం రాత్రి కొణిజర్ల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను సోదా చేసి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
జూలూరుపాడులో..
జూలూరుపాడు, జూలై 24: జూలూరుపాడు ప్రధాన మార్గంలోని పోలీస్స్టేషన్ ఎదుట సోమవారం టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు మండల కేంద్రంలో వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారును ఆపి సోదా చేశారు. కారులో రవాణా చేస్తున్న 30 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళతోపాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.