వానకాలం వచ్చిందంటే ప్రయాణం నరకప్రాయమే. వర్షాలతో బురద పొలాలను తలపించే మట్టి రోడ్లు.. వాగులు వంకలు పొంగిపొర్లడంతో పల్లెలకు రోజులకొద్దీ నిలిచిపోయే రాకపోకలు. ఆపదొస్తే సదరు రోగులను, పురిటినొప్పులతో ఇబ్బందిపడే గర్భిణులను జట్టి కట్టి లేదా ట్రాక్టర్లలో ప్రాణాలను పణంగా పెట్టి ఆస్పత్రులకు తరలించడం ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో ఇదంతా నిత్యకృత్యం. గత పాలకులకు ప్రజలు, గిరిజనులు గోడు చెప్పుకున్నా.. సమస్య తీరింది లేదు. రోడ్లు వేసిందీ లేదు. తెలంగాణ సిద్ధించిన తర్వాత వాటన్నింటికీ పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే మెచ్చా కోరిన వెంటనే సీఎం కేసీఆర్ గిరిజన ప్రాంతాలు, గూడేలపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 43.8 కి.మీ మేర బీటీ రోడ్లు, హైలెవల్ వంతెనల నిర్మాణానికి రూ.45 కోట్లు మంజూరు చేశారు. భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అధికారులకు నిర్మాణ బాధ్యతలు అప్పగించగా అధికారులు పనుల ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. – అశ్వారావుపేట, సెప్టెంబర్ 10
అశ్వారావుపేట, సెప్టెంబర్ 10 : మారుమూల గిరిజన గూడేలకు సరైన రహదారి వసతి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానకాలంలో వాగులు వంకలు పొంగి ఏజెన్సీలో రాకపోకలు స్తంభిస్తున్నాయి. గుంతల రోడ్లపై వాహనాలు నడపలేక వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. సమస్యల తీవ్రతను గమనించిన సీఎం కేసీఆర్ రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామగ్రామానికి రోడ్డు వేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గంలో బీటీ రోడ్లు, హైలెవల్ వంతెనలు నిర్మించాలని కోరిన వెంటనే సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అన్నపురెడ్డిపల్లి మండలం మినహా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో 43.8 కిలోమీటర్ల మేర 22 బీటీ రోడ్లు, మూడు హైలెవల్ వంతెనల నిర్మాణానికి రూ.45.01 కోట్లు విడుదల చేశారు. భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అధికారులు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో రవాణా సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అనేకసార్లు హైదరాబాద్కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. అడిగిందే తడవుగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఏజెన్సీ పరిధిలోకి వస్తుండడంతో రోడ్లు, వంతెనల నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతలను ఐటీడీఏ స్వీకరించింది. ఇప్పటికే ఐటీడీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్ల నిర్మాణాలకు అంచనాలు రూపొందించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ పనులను వేగిరం చేస్తున్నారు.
అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం నుంచి జగన్నాథపురం వరకు 4.30 కి.మీ మేర ప్రభుత్వం రూ.3.44 కోట్ల నిధులతో రహదారి నిర్మించనున్నది. రూ. 80 లక్షలతో నందిపాడు నుంచి కొమరంవారి గుంపు వరకు 1 కి.మీ, రూ.2.27 కోట్లతో నందమూరినగర్ నుంచి పేటమాలపల్లి వరకు 3.40 కి.మీ, రూ.1.36 కోట్లతో ఆర్అంబీ రోడ్డు నుంచి బిల్లుడిగూడెం వరకు 1.70 కి.మీ, రూ.80 లక్షలతో దిబ్బగూడెం నుంచి తాటినాగులుగుంపు వరకు 1 కి.మీ, రూ.48 లక్షలతో దమ్మపేట మండలం ఆర్అండ్బీ రోడ్డు నుంచి బాలరాజుగూడెం వరకు 0.60 కి.మీ, రూ.
1.60 కోట్లతో మందలపల్లి నుంచి గాంధీనగర్ హైవే వరకు 2 కి.మీ, రూ.1.60 కోట్లతో మందలపల్లి నుంచి సబ్ స్టేషన్ వరకు 2 కి.మీ, రూ.80 లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు నుంచి లంక వరకు 1 కి.మీ, రూ.1.60 కోట్లతో నాచారం నుంచి నరసింహాస్వామి టెంపుల్ వరకు 2 కి.మీ, రూ.80 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుంచి మల్లారం వరకు 1కి.మీ, రూ.1.76 కోట్లతో గుత్తావారిగూడెం నుంచి గంగులగూడెం వరకు 2.20 కి.మీ, రూ.
2.50 కోట్లతో చిల్లగుంపు నుంచి రింగిరెడ్డిపల్లి వరకు 5.20 కి.మీ, రూ.2.00 కోట్లతో ములకలపల్లి మండలం మంగపేట నుంచి రామానుజపురం వరకు 2.50 కి.మీ, రూ.1.12 కోట్లతో కొత్త జిన్నెలగూడెం నుంచి రాచన్నపేట వరకు 1.40 కి.మీ, రూ.1.60 కోట్లతో చౌటిగూడెం నుంచి రింగిరెడ్డిపల్లి వరకు 2 కి.మీ, రూ.1.68 కోట్లతో జగన్నాథపురం నుంచి రేగులగుంట వరకు 2.10 కి.మీ, రూ.1.12 కోట్లతో కొమ్ముగూడెం నుంచి అల్లిగుంపు వరకు 1.40 కి.మీ, రూ.4.50 కోట్లతో హైలెవల్ వంతెనతో ఆర్అండ్బీ రోడ్డు నుంచి తాళ్లపాయ వరకు 1 కి.మీ, రూ.4.63 కోట్లతో హైలెవల్ వంతెనతోపాటు కుమ్మరిపాడు వరకు 1 కి.మీ, రూ.5.25 కోట్లతో హైలెవల్ వంతెనతోపాటు ముత్యాలంపాడు వరకు 1 కి.మీ, రూ.2.85 కోట్లతో పోకలగూడెం నుంచి నల్లబండ్లబోరు వరకు 4.00 కి.మీ రహదారిని ప్రభుత్వం నిర్మించనున్నది.
గ్రామాల అభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది. ఇదే ఒరవడిలో అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ రహదారులు నిర్మిస్తున్నది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ విరివిగా నిధులు మంజూరు చేస్తున్నారు. కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
– మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే, అశ్వారావుపేట