కరీంనగర్ స్మార్ట్సిటీ అభివృద్ధి పనులపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ చేశారు. ఈ పనులకు సంబంధించి పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అందించాలని నగరపాలక సంస్థ, స్మార్ట్సిటీ కంపెనీ అధికారులకు శుక్రవారం లేఖ రాశారు. వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, డీపీఆర్లు, టెండర్లు, ఎంబీ రికార్డులు, చెల్లింపులు ఇలా అన్ని వివరాలను పంపించాలని అందులో సూచించారు. విజిలెన్స్ విచారణ మొదలు కావడం బల్దియాలో చర్చనీయాశంమైంది. ఇటు పలువురు కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారుల్లో గుబులు పుడుతున్నట్టు తెలుస్తున్నది.
కార్పొరేషన్, జూన్ 21 : ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షలో విజిలెన్స్ విచారణ చేపడుతామని తెలిపారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. స్మార్ట్సిటీలో ప్యాకేజీ 2లోని ఫేస్-1 అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ మంజూరుతోపాటు ఎంబీ రికార్డులను మూడు రోజుల్లో అందించాలని నగరపాలక సంస్థ అధికారులు, స్మార్ట్సిటీ కంపెనీ అధికారులకు సూచించారు. ఇంకా వరదకాలువల నిర్మాణాలు, ఫేస్ 2లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రోడ్లు, స్టాటిక్ కంప్యాక్టర్ స్థాపనతోపాటు షెడ్ నిర్మాణం, రోడ్డు సూచికలు, అంబేద్కర్ స్టేడియంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రత్యేక వినియోగ ఆఫీస్ (ఎస్పీవీ), ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డీఆర్ఎఫ్ కార్యాలయ సివిల్ పనులు, సాంకేతిక (ఐటీ) పనులకు సంబంధించి ప్రతిపాదనలు, టెక్నికల్ మంజూరీలు తదితర పూర్తి వివరాలను అందించాలని స్పష్టం చేశారు. వీటితోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ, కరీంనగర్ డెయిరీ సమీపంలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ , టవర్సర్కిల్లో రెనోవేషన్ పను లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులు, పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 24 గంటల మంచినీటి సరఫరా పనులకు సం బంధించిన పూర్తి వివరాలు అందించాలని శుక్రవారం పంపించిన లేఖలో కోరారు. మొత్తంగా స్మార్ట్సిటీ పనులపై విజిలెన్స్ ఫోకస్ చేయడం బల్దియాలో హాట్టాపిక్గా మారింది. కొద్ది రోజులుగా వివిధ వర్గాలు, కార్పొరేటర్ల నుంచి విమర్శలు వస్తుండగా.. ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.