‘సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ప్రైవేట్కు అప్పనంగా కట్టబెట్టి సంస్థ మనుగడను, 40వేల మంది కార్మికుల భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చాలని చూస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్టు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మరో పోరాటం చేసైనా సరే బొగ్గు బ్లాకులు వేలాన్ని అడ్డుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెబుతాం’ అని టీబీజీకేఎస్ నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వేలానికి వ్యతిరేకంగా సోమవారం నుంచి పోరుబాట పడుతున్నామని, దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్న ఆయన, ప్రైవేట్ వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తట్ట బొగ్గు కూడా ఎత్తకుండా అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.
– గోదావరిఖని, జూన్ 30
ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి మరో వందేళ్లపాటు బొగ్గు వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి. కార్మికుల ఉద్యోగాలకు ఢోకాలేదు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్కు అప్పగిస్తే బొగ్గు నిలువలు వేగంగా తగ్గిపోయి, సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. సింగరేణిలో ఇప్పటికే కార్మికుల సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో బొగ్గు బ్లాకులు ప్రైవేట్పరమైతే పర్మినెంట్ కార్మికుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. జాబు గ్యారంటీ లేకుండా పోతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను నియమించి అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరి చేయిస్తారు.
సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు అంటగట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సపోర్టు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల బొగ్గు బ్లాక్ల వేలంపై కేంద్రం మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై, వేలాన్ని వ్యతిరేఖిస్తున్నట్లు లెటర్ ఇచ్చినట్లు చెబుతున్నరు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకించినట్లయితే వేలానికి సంబంధించిన మీటింగ్కు హాజరయ్యే లెటర్ ఇవ్వా లా..? మరోజు ఇవ్వవచ్చు కదా..? ఈ విషయం చా లా అనుమానాలకు తావిస్తున్నది. ఈ కారణంగానే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సింగరేణిలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్లకుండా అడ్డుకొని తీరుతాం.
సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో సింగరేణి సంస్థ కు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ ఏర్పాటుతో సిం గరేణి సంస్థ ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించేలా ముందుకు సాగుతుంది. సీమాంధ్రలో హయాంలో కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర రాష్ర్టాల్లో గనుల నిర్వహణ తెలంగాణ ఏర్పడిన అనంతరమే జరిగాయి. ఇప్పుడు సింగరేణి పరిస్థితి మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలం పేరుతో సింగరేణి సంస్థకు సంబంధించిన గనులను ప్రైవేట్ వ్యక్తులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిని గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సంస్థ మనుగడను కాపాడేందుకు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎక్కువగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లో ప్రైవేట్ వ్యక్తులు ఒక తట్ట బొగ్గు కూడా ఎత్తకుండా అడ్డుకునే విధంగా ముందుకు సాగుతాం. సంస్థలో ఇం కా అనేక సమస్యలున్నాయి. వాటిపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష కార్మిక సంఘంగా ఉండి పోరాటం చేస్తాం.
వాస్తవంగా ఏ కార్మిక సంఘం ఏడుగురు సభ్యులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వారు ఎవరికి అనుబంధంగా ఉంటామనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి బీఆర్ఎస్తోనే టీబీజీకేఎస్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సింగరేణి సంస్థను అదోగతి పాలు చేయడానికి చూస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ క్రమంలో టీబీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీతోనే అనుబంధం కొనసాగించాలని భావిస్తున్నది. తాము టెక్నికల్గా ఏ పార్టీకి అనుబంధం లేనప్పటికీ వాస్తవానికి మాత్రం బీఆర్ఎస్తోనే అనుబంధంగా ఉండాలని భావిస్తున్నాం.