నల్లనేల భగ్గుమన్నది. సిరుల సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకం కదం తొక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై పోరుబాట పట్టింది. టీబీజీకేఎస్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. అధికారులకు వినతి పత్రాలు అందించారు. బొగ్గు బావులను సింగరేణి సంస్థకే అప్పగించాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
గోదావరిఖని జూలై 1: రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే 1, 2, 2ఏ, 11 గనులతో పాటు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు-5, ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2లో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జీఎం కార్యాలయం వద్ద టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి పాల్గొన్నారు. రామగుండం ఒకటో డివిజన్లో ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో, ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2లో టీబీజీకేఎస్ నాయకులు ఉప్పుల వెంకటేశ్వర్లు, నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను బొంద పెట్టడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బొగ్గు బ్లాక్ల వేలంతో సింగరేణిలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. వాళ్ల తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఎంఎండీఆర్ 2017 చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్, బీజేపీలు విష ప్రచారం చేస్తున్నాయని, దమ్ముంటే నిజనిర్ధారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గనిపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే సురేందర్రెడ్డి కార్మికులతో నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఆయా కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు ఎల్ వెంకటేశ్, పోలాడి శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్యనారాయణ, రాజేశం, దూట శేషగిరి, గనుల కార్యదర్శులు బొగ్గుల సాయి, ఉప్పులేటి తిరుపతి, లక్ష్మణ్, గోపి, సురేందర్, వాసర్ల జోసఫ్, పులిపాక శంకర్, మల్లేశ్, రోడ్డ సంపత్, నూతి రాజ్కుమార్, కళాధర్రెడ్డి, గడ్డి శ్రీనివాస్ ఉన్నారు.