కరీంనగర్ ప్రజల చిరకాల కల నెరవేరబోతున్నది. జిల్లావాసులు ఎప్పటి నుంచో కోరుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే జిల్లాలో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు కొత్తపల్లి పట్టణ శివారులో సర్కారు కాలేజీ ఏర్పాటు కాబోతున్నది. 150 కోట్లతో సుమారు 25 ఎకరాల్లో భవన సముదాయం నిర్మించేందుకు టెండర్లు పూర్తికాగా, ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలన్న లక్ష్యంతో రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. 7 కోట్లతో ఇక్కడి విత్తనోత్పత్తి సంస్థకు చెందిన నాలుగు గోదాములను కళాశాల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దింది. 100 సీట్లకు గాను 85 మంది ఇప్పటికే జాయిన్ కాగా, ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విశేష కృషి వల్లే ఇది సాధ్యం కాగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అందుబాటులోకి రాగా, ఈ నెల 15న కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో ప్రారంభించబోతున్నది. వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.
కరీంనగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచన కూడా చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ నిరంతర పర్యవేక్షణతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయి. 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కళాశాల స్థాపన పనులను చేపట్టి అనతి కాలంలోనే పూర్తి చేసింది. దీంతో ఈ నెల 15న సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ఈ కళాశాలను ప్రారంభిస్తున్నారు. అదే రోజు నుంచి తరగతులు నిర్వహించనున్నారు.
తాత్కాలిక భవనంలో అన్ని ఏర్పాట్లు
కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లను గతంలోనే కేటాయించింది. కరీంనగర్కు సమీపంలోని కొత్తపల్లి పట్టణ శివారు విత్తనోత్పత్తి సంస్థ స్థలంలో సుమారు 25 ఎకరాల్లో ఈ కళాశాల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే 2023-24 విద్యా సంవత్సరంలోనే తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల నిధులతో ఇక్కడి విత్తనోత్పత్తి సంస్థకు చెందిన నాలుగు గోదాములను కళాశాల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దింది. తాత్కాలికంగా రెండు లెక్చరర్ గదులు, సెంట్రల్ లైబ్రరీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలను, హాస్టల్ ల్యాబ్, స్టాఫ్ క్వార్టర్స్, ల్యాబ్, తదితర మౌళిక సదుపాయాలను సమకూర్చింది.
15న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఈ మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, ఇప్పటికే 85 సీట్లను భర్తీ చేశారు. అడ్మిషన్స్కు ఇంకా దరఖాస్తులు వస్తున్నాయి. కళాశాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శీలం లక్ష్మీనారాయణ తెలిపారు. అవసరమైన ఫ్యాకల్టీలో ఐదు ప్రొఫెసర్, మరో ఐదు అసోసియేట్ ప్రొఫెసర్స్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, తదితర పోస్టులను ఇప్పటికే భర్తీ చేశారు. పరిపాలన విభాగానికి అవసరమైన అన్ని పోస్టులను భర్తీ చేశారు. తాత్కాలికంగానే అయినా అన్ని హంగులు కల్పించడంతో ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి తరగతులు నిర్వహించనున్నారు.
ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యకళాశాలలో తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. కళాశాలలో ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. తరగతుల బోధనకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నియమించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించింది. తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం చూస్తున్నరు. ఒకేసారి తరగతులు ప్రారంభించేందుకు మెడికల్ కౌన్సిల్ కూడా అనుమతులు మంజూరు చేసింది. 15న తరగతులను వర్చువల్ విధానంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా సమాచారం అందించాం. వారు తరగతులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నరు.
-ప్రొఫెసర్ శీల లక్ష్మీనారాయణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్