రాజన్న సిరిసిల్ల, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో సిరిసిల్ల జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపామని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఉద్ఘాటించారు. అధికారులు, పాలకవర్గం కృషి, గత సర్కారు విరివిగా నిధులు విడుదల చేయడంతో జిల్లా పరిషత్కు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు దక్కిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లా డుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాకు తొలి అధ్యక్షురాలిగా ఉండి ప్రజలకు సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన కేసీఆర్, కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీగా అవకాశం ఇచ్చిన కోనరావుపేట మండల ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, మనం చేసిన సేవలే చిరకాలం గుర్తుంటాయని అన్నారు.
అధికారులు, పాలకవర్గ సభ్యుల సమష్టి కృషి వల్లనే జిల్లాకు ఉత్తమ అవార్డు వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీఎస్టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ వైస్చైర్మన్ సిద్దం వేణు, జడ్పీటీసీలు గుండం నర్సయ్య, ఉమ, గట్ల మీనయ్య, నాగం కుమార్, మ్యాకల రవి, ఏషవాణీ, చీటి లక్ష్మణ్రావు, గుగులోత్ కళావతి, విజయ, కోఅప్షన్ సభ్యులు చాంద్పాషా పాల్గొన్నారు.
జడ్పీ పాలకవర్గ పదవీ కాలం గడువు ముగుస్తున్నందున చైర్పర్సన్ అరుణతో పాటు సభ్యులందరిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు, బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.