శంకరపట్నం/ వీణవంక/ మానకొండూర్, జూన్ 30: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న రైతు భరోసా పథకం తమకు మేలు చేసేలా ఉండాలని రైతులు ముక్త కంఠంతో కోరారు. రైతు భరోసా పథకం అమలు తీరు, విధి విధానాలపై అభిప్రాయాలు కోరుతూ ఆదివారం జిల్లాలోని వివిధ సింగిల్విండోల కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శంకరపట్నం మండలంలోని గద్దపాక, మెట్పల్లి సింగిల్విండో కార్యాలయాల్లో మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసాకు ఎన్ని ఎకరాలకు పరిమితి విధించాలి..? ఎంత చెల్లించాలి..? కౌలు రైతుల గుర్తింపు.., బోనస్ ఎవరికి చెల్లించాలి..? రైతు బీమా.. తదితర అంశాలపై పలువురు రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు రైతు భరోసా పథకం కొనసాగించాలని, తద్వారా రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. అలాగే రైతుబీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని పలువురు కోరారు. నోడల్ అధికారి శ్రీనివాస్, డీసీవో ఆడిటర్ మనోజ్కుమార్, చైర్మన్లు గుర్రాల తిరుపతిరెడ్డి, పొద్దుటూరి సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ రమేశ్, ఏఈవోలు, సీఈవోలు శ్రీనివాస్, సదయ్య, విండోల డైరెక్టర్లు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ‘రైతు భరోసా’పై రైతుల అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ, రైతు భరోసాను ఎలాంటి ఐటీ రిటర్న్తో సంబంధం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలని కొంతమంది కోరగా, 10 ఎకరాల వరకు పథకాన్ని వర్తింపజేయాలని మరికొంత మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ మావురపు విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రైతుల అభిప్రాయాలు సేకరించామని, అధికారుల సమక్షంలో రికార్డులో నమోదు చేసి, ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చీఫ్ ఆడిటర్ మనోజ్కుమార్, ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, సీఈవో ప్రకాశ్రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మడుగూరి సమ్మిరెడ్డి, గెల్లు మల్లయ్య, సీహెచ్ శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్రెడ్డి, ఏఈవో శ్రీకాంత్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు నల్ల గోవిందరెడ్డి అధ్యక్షతన ఆదివారం కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్బుక్ను యూనిట్గా తీసుకుని 10 ఎకరాల భూమి ఉన్న ప్రతిరైతుకు రైతుభరోసా ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సాగుకు పనికిరాని భూములకు రైతుభరోసా ఇవ్వొద్దని తీర్మానించారు. అలాగే 10 ఎకరాల భూమి ఉండి ఇన్కంటాక్స్ రిటర్న్ చేసే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని తీర్మానం చేసినట్లు సింగిల్విండో అధ్యక్షుడు గోవిందరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి. సింగిల్విండో డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.