పెద్దపల్లి, జూలై 2(నమస్తే తెలంగాణ)/ జగిత్యాలటౌన్/ సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలోని జడ్పీ అధ్యక్షులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ అధ్యక్షులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, దావ వసంత-సురేశ్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జడ్పీ అధ్యక్షులందరికీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పని చేసే వాళ్లు నిజమైన నాయకులన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్లను కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కాగా, మంగళవారం కరీంనగర్ చివరి జడ్పీ మీటింగ్ ఉన్నందున జడ్పీ చైర్పర్సన్ కే విజయ హాజరుకాలేదు.