కోల్సిటీ, ఏప్రిల్ 21: ‘చిన్న చిన్న విభేదాలను పక్కనబెడుదాం. కలిసికట్టుగా పనిచేసి రామగుండంపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేద్దాం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. అధినాయకత్వం సూచనల మేరకు పార్టీ పటిష్టానికి కృషి చేయాలని నిర్దేశించారు. కార్పొరేటర్లు కూడా చిత్తశుద్ధితో తమ బాధ్యతను నెరవేర్చాలని కర్తవ్యబోధ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 25న ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రామగుండం ఎన్టీపీసీలో నియోజకవర్గ సమ్మేళనాన్ని నిర్వహించుకుందామని స్పష్టంచేశారు. శుక్రవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని రామగుండం కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నియోజకవర్గ సమావేశం విజయవంతపై చర్చించి సూచనలు చేశారు.
సుమారు ఐదువేల మంది హాజరుకానున్నారని తెలిపారు. కొంతకాలంగా నియోజవర్గంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గులాబీ పార్టీదే అంతిమ విజయమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు సూచించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని ఉద్బోధించారు. అనంతరం నగరంలో జరగాల్సిన, జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడంతో వాటిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. సమావేశంలో నగర పాలక మేయర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.