కరీంనగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్: తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమది ప్రజాస్వామిక ప్రజల ప్రభుత్వమని, రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితులను కల్పిస్తున్నామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామని, ఎక్కడైనా తప్పు జరిగినా అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో నగర పాలక సంస్థ అధికారులు, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. నగరంలో చేపట్టిన పనులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. సీఎం అస్యూరెన్స్ కింద, స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనుల ప్రగతితోపాటు తాగు నీటి సరఫరా, శానిటేషన్పై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. స్మార్ట్ సిటీలో భాగంగా వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు, టెక్నాలజీ కాంపొనెంట్ కింద 98 కోట్లతో అనేక రకాల పనులు , 700 సీసీ కెమెరాలు ఏర్పాటు, సీసీ టెలివిజన్ తదితర పనుల ప్రగతి చర్చించామని తెలిపారు. ఇక నుంచి వారానికో విభాగంపై సమీక్షించాలని కలెక్టర్ పమేలా సత్పత్తిను కోరినట్టు చెప్పారు. మున్సిపల్ జనరల్ ఫండ్స్తో పాటు ఇతర గ్రాంట్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కలెక్టర్తోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కూడా మున్సిపల్ బిల్లుల విషయంలో దృష్టి సారించాలని ఆదేశించామని, మెప్మా సంఘాలకు ఇచ్చే రుణాలపైనా చర్చించినట్లు చెప్పారు.
ఎవరైనా భూకబ్జాలకు పాల్పడినా, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేసినా స్వేచ్ఛగా అధికారులకు ఫిర్యాదు చేయాలని నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, అనధికారిక నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుల సంయుక్తంగా విచారణ జరపాలని ఆదేశించామని, వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీటిపై తమకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్)లో 72 శాతం పనులు పూర్తయ్యాయని, వానకాలం నేపథ్యంలో మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. టూరిజం డెవలప్మెంట్కు 100 కోట్లు మంజూరు చేస్తే 30 కోట్లు విడుదల చేశారని తెలిపారు. అందులో 5 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసినట్టు అధికారులు వివరించారని, ఈ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
స్మార్ట్సిటీలో భాగంగా చౌరస్తాల ఆధునీకరణ కింద ఇందిరా చౌక్లో 1.30 కోట్లు ఖర్చు చేశారని, ఎలాంటి అనుమతి లేకుండా 50 లక్షలు అదనంగా ఖర్చు పెట్టారని అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. నాణ్యతా ప్రమాణాల విషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో విజిలెన్స్ విచారణ జరుగుతున్నదని, ఎక్కడైనా లోపం ఉంటే తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. నగరంలో మొదట ట్రాఫిక్ సిగ్నల్ అవసరం లేదనుకున్నారని, ఇప్పుడు ఆరు చౌరస్తాల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేశారని, దీనిపైనా సమీక్షిస్తామన్నారు.
మున్సిపల్ పనుల్లో అక్రమాలు జరిగినట్టయితే ప్రభుత్వ విధానాల మేరకు చర్యలు ఉంటాయని వెల్లడించారు. స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 79 పనుల్లో కొన్నింటిని ఇతర పథకాల కింద వచ్చిన నిధులతో కూడా చేపట్టారని, ఓవర్ లాపింగ్ పనులపై విచారణ జరిపిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖతోపాటు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కే మహేశ్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.