పెద్దపల్లిరూరల్, జూలై 3: అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనంతో పనిచేయాలని, వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు. మంథని అటవీ ప్రాంతమైనందున పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి విరివిగా మొక్కలు నాటాలని నిర్దేశం చేశారు.
బుధవారం పెద్దపల్లి మండలం పెద్దకల్వల గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్, కాలేజీ గ్రౌండ్ ఆవరణలో ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం లెక్కల కోసం మొక్కలు నాటవద్దని, సంరక్షించి పెద్దచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, కేశోరాం సిమెంట్స్, రైస్మిల్లుల సిబ్బందిని వనమహోత్సవంలో భాగస్వాములను చేయాలని కోరారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్టీవో రవీందర్, డీఎఫ్వో శివయ్య, జడ్పీ సీఈవో నరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనర్సయ్య, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.