కరీంనగర్ కలెక్టరేట్/తెలంగాణ చౌక్, జూన్ 21 : దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతూ.. వారి భవిష్యత్తుతోనే కేంద్రం ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. ‘ఖబడ్దార్ ఎన్డీఏ సర్కార్’ అంటూ హెచ్చరించాయి. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని, నీట్ను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు ధర్నా చేశారు. అంతకు ముందు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ, జాతీయ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా వైఫల్యం చెందిందని, సత్వరమే ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రమే నీట్ పేపర్ లీక్ కావడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నా ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడకపోతే కేంద్ర మంత్రులను, బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓవైపు నీట్లో అవకతవకలు, మరోవైపు యూజీసీ నెట్ రద్దుతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని మండిపడ్డారు. నీట్లో జరిగిన అక్రమాలు కప్పి పుచ్చేందుకే కేంద్రం యూజీసీ నెట్ను రద్దు చేసిందని ఆరోపించారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలు రాష్ర్టాలకు అప్పగించాలని సూచించారు. నీట్పై కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, లేనిపక్షంలో వారి ఇండ్లను ముట్టడించేందుకు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ మాట్లాడగా, విద్యార్థి సంఘాల నాయకులు రామారపు వెంకటేశ్, అరవింద్, నీరటి రాంప్రసాద్, నరేశ్, మామిడిపల్లి హేమంత్, రోహిత్, కనకం సాగర్, రామ్యాదవ్, ఇషాక్, వినయ్, 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.