భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంథని ఆర్డీవోను ఆర్అండ్ఆర్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయనకు సింగరేణి సంస్థ ప్రత్యేక వాహనం కేటాయించింది. మెయింటనెన్స్, ఫ్యూయల్ ఖర్చులను సైతం భరిస్తుంటుంది. అయితే, ఇదే అదునుగా అవినీతికి తెరలేచినట్టు తెలుస్తున్నది. సదరు అధికారి సొంత కారునే అద్దె వాహనంగా చూపడమే కాదు, నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్, ఇతర ఖర్చుల పేరిట బిల్లులు కాజేస్తున్నారనే ఆరోపణులు వెల్లువెత్తుతున్నాయి. బినామీ పేరిట బిల్లులు డ్రా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపల్లి, జూన్ 28(నమస్తే తెలంగాణ)/మంథని: ఆర్అండ్ఆర్ ప్రత్యేకాధికారి అయిన మంథని ఆర్డీవో హనుమానాయక్కు సింగరేణి సంస్థ గతేడాది మార్చిలో ఏడాదికి 4,80,000 అద్దెతో ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అయితే, ఆ వాహనం కొద్ది రోజులే కనిపించింది. తర్వాత ఏమైందో ఏమోగానీ మంథని ఆర్డీవో ఆ వాహనాన్ని తప్పించి, తన సొంత పేరుపై రిజిస్ట్రేషన్ అయిన నెక్సా ఎక్స్ఎల్ 6 మోడల్ కారు (టీఎస్ 07 హెచ్ఎన్ 6692)నే అద్దె వాహనంగా వాడుతున్నాడు. ఈ వాహనం హనుమానాయక్ వాదిత్య పేరుపై 11-14-2062/సీ7/301, విజయదుర్గ నిల యం, చిత్రలేవుట్ ఎల్బీనగర్, సరూర్నగర్, రంగాడ్డి జిల్లా పేరుతో రిజిస్టరై ఉన్నది. ఇదే వాహనాన్ని సింగరేణి అద్దె వాహనంగా వినియోగిస్తూ.. బిల్లులను కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కొన్ని కొన్ని చెల్లింపుల్లో తన బినామీగా ప్రచారం జరుగుతున్న కే అవినాశ్ పేరిట బిల్లులను డ్రా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఆర్డీవో తన పేరుపై రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న వాహనానికి పెట్రోల్, ఇతర ఖర్చులను సింగరేణి, ప్రభుత్వం నుంచి బిల్లులను చెల్లిస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవంగా సింగరేణి సంస్థ కానీ, ప్రభుత్వం కానీ, ట్యాక్స్ ప్లేట్ ఉన్న వాహనాలను మాత్రమే లీజ్కు తీసుకుంటుంది. లీజ్ ఏడాదికి 4,80,000 చెల్లిస్తున్న క్రమంలో వాహనానికి సంబంధించి మరే ఖర్చులు, పెట్రోల్ సహా ఓనరే చెల్లించాల్సి ఉంటుంది. కానీ, సదరు అధికారి ఆ నిబంధనలను తుంగలోకి తొక్కినట్టు తెలుస్తున్నది. 2023 అక్టోబర్ 17న ఓం టైర్స్ అండ్ ఆయిల్ స్టోర్స్ పెద్దపల్లిలోని షాపులో కారు (టీఎస్ 07 హెచ్ఎన్ 6692) టైర్లు కొనుగోలు చేసినట్టు 30 వేల బిల్లులను డ్రా చేసినట్టు తెలిసింది. అలాగే, గత మేలో మంథని రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఖాతా నుంచి 86,078 పెట్రోల్ బిల్లు చెల్లింపులకు మంథనిలోని శ్రీ రామకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ పేరిట చెక్కును సిద్ధం చేసినప్పటికీ, దానిని క్యాన్సల్ చేసి అవినాశ్ పేరిట మే 18న చెక్కును డ్రా చేసినట్టు బయటపడింది. తాజాగా శ్రీ రామకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ పేరిట 35,777 బిల్లు లేపినట్టు తెలిసింది.
మంథని ఆర్డీవో భూ సేకరణ ప్రత్యేకాధికారి కూడా కావడంతో మంథని డివిజన్ పరిధిలోని సింగరేణి, కాళేశ్వరం ప్రాజెక్టు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులు ఆర్అండ్ఆర్ అధికారి ఖాతాలోనే పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నాయి. అయితే, ఈ డబ్బులపై వడ్డీ కూడా ప్రతి నెలా అత్యధికంగానే జమ అవుతూ వస్తున్నది. ఈ డబ్బుల నుంచి ఎలాంటి ఖర్చులు, చెల్లింపులు చేయాలన్నా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. కానీ, ఆ నిబంధనలు పాటించకుండానే వడ్డీ డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్లోబల్ కాంట్రాక్టర్స్(ఏజెన్సీ) ద్వారా అన్ని కలెక్టరేట్, రిటర్నింగ్ అధికారుల (ఆర్డీవో) కార్యాలయాలకు జూనియర్ అసిస్టెంట్లుగా తాత్కాలిక సిబ్బందిని నియమించారు. అదే సమయంలో మంథని ఆర్డీవో ఆఫీస్లో జాయిన్ అయిన కే అవినాశ్పై అనేక ఆరోపణలు వచ్చాయి. ధరణితోపాటు ఇతర కార్యకలాపాల్లో అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారని మీడియాలో కథనాలు రావడంతో అతన్ని విధుల నుంచి పక్కన పెట్టి, ఆర్డీవో ఆఫీస్కు రానివ్వడం లేదని తెలిసింది. కానీ, అదే వ్యక్తి ఆర్డీవో నివాసముండే రామగిరి గెస్ట్హౌస్లో ఆఫీస్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నేను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న వాహనం సింగరేణి సంస్థ కేటాయించినదే. నా వాహనం అని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఫ్యూయల్ చెల్లింపుల్లో సైతం ఎలాంటి అక్రమాలు జరగలేదు. అదంతా తప్పు.
– హనుమానాయక్, ఆర్డీవో (మంథని)