జగిత్యాల, జూలై 1, (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ నుంచి పోవడంతో జగిత్యాల బీఆర్ఎస్కు పట్టిన శనిపోయినట్టయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సంజయ్ కుమార్ వల్ల ఉద్యమకారులతోపాటు చాలా మంది కార్యకర్తలు తీవ్ర మనస్తాపం చెందారని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరినీ ఆదుకునే బాధ్యత తమదేనని, ‘మీ అందరికీ మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని స్పష్టం చేశారు. కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటామని, ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా సమావేశానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, శ్రేణులను చూస్తే సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
త్వరలోనే కవితక్క వస్తుందని, జగిత్యాలలో గల్లీ గల్లీ తిరుగుదామని, రాబోయే స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని, సంజయ్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ పార్టీ మారడాన్ని తప్పు పట్టారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేసినందుకా.. లేక రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినందుకా.. పార్టీ మారవని ప్రశ్నించారు. ‘జిల్లాను రద్దు చేస్తా.. నర్సింగ్ కాలేజీని మూసివేస్తా.. రోడ్డు మంజూరు చేయను అని రేవంత్ రెడ్డి అన్నందుకే పార్టీ మారారా..?’ అంటూ నిలదీశారు. ఇవన్నీ కాదని, సీఎం ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ మారిండని ధ్వజమెత్తారు. ఒక పార్టీ బీఫాం మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లే ‘ఆయారాం, గయారాం’ అనే నీచ సంస్కృతి కాంగ్రెస్ వల్లే పుట్టిందని ధ్వజమెత్తారు.
2004లో 26 మంది తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో పది మందిని లాక్కున్నారని, 2009లో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు సైతం అదే పనిచేశారని గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్రెడ్డి కొనుగోలు చేసేందుకు యత్నించి 50 లక్షలతో దొరికిపోయాడన్నారు. బీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా ఇతర పార్టీల లెజిస్లేచర్ పార్టీ విభాగాలను 3/2 వంతు మెజార్టీతో చేర్చుకుందన్నారు.
ఇప్పుడు రేవంత్రెడ్డి చేస్తున్న పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమైనవని మండిపడ్డారు. ఒకపార్టీలో గెలిచి మరో పార్టీకి పోయేవారిని రాళ్లతో కొట్టిచంపాలని రేవంత్రెడ్డి గతంలో పిలుపునిచ్చారని, శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేసేలా చట్టం తెస్తామని రాహుల్గాంధీ అన్నారని, ఇప్పుడు పార్టీ మారిన డాక్టర్ సంజయ్కుమార్ను, మార్చుకున్న రేవంత్రెడ్డిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలని సూచించారు. పాంచ్న్యాయ్ సూత్రాల పేరిట మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్గాంధీ ఫిరాయింపులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఇదే విషయాన్ని ఇతర పార్టీల బీఫాంలపై గెలిచిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఎంపీటీసీ బీఫాంను సైతం జీవన్రెడ్డి సంజయ్కుమార్కు ఇవ్వనివ్వడని, రాజకీయంగా బతుకనివ్వడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు, అమలుగాని విధానాలను పరిశీలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, కోరుకంటి రవిచందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి సాధ్యమైంది. జిల్లాను చేసి, కలెక్టర్ను తెచ్చి, ఎస్పీని తెచ్చిందెవరు? కేసీఆరే కదా. 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లు, వంతెనలు, రోళ్లవాగు నిర్మించినం. కరెంట్ బాగు చేసినం. ఇలా అనేకం చేసినం. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలి. ఎంగిలి మెతుకులకు ఆశపడి పోయిన ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలి.
– కేటీఆర్
హైదరాబాద్లోని ఐటీ రంగంలో కేటీఆర్ విప్లవం సృష్టించిండు. ఈ దృశ్యాన్ని దేశమంతా చూసిన్రు. పార్టీ మారిన సంజయ్ కుమార్ గురించి మాట్లాడడానికి నాకు మనసు రావడం లేదు. సముద్రంలో నీరు ఇంకి పోదు. చెలిమె తవ్వితే నీళ్లు వచ్చినట్టు బీఆర్ఎస్లో నాయకులు పుట్టుకొస్తరు. బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలం ఉండదు. మనకే కష్టం వచ్చింది. సంజయ్ కుమార్ కోసం కవిత కష్టపడి గల్లీ గల్లీ తిరిగారు. ఆయన వ్యవహార శైలితో నా కండ్లల్లో కూడా నీళ్లు తెప్పించిండు. నేను ఇదే పార్టీలో ఉన్న. ఆయనే పార్టీ మారిండు. రాబోయే స్థానిక సంస్థల్లో ఊహించని గెలుపు అవకాశాలు మనకు ఉన్నయి.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ మాత్రమే. సింహం సింగిల్గా వస్తది. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన్రు. పార్టీని వీడిన వారి గురించి మాట్లాడడం అనవసరం. గ్రామాల్లో పార్టీ బలంగా ఉన్నది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీ వీడితే ఆ నియోజకవర్గంలో ఆయనను తిట్టని వారు లేరు.
– బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే
ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో నాకు సోపతి ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కేటీఆర్ను హైదరాబాద్కు రప్పించమని కేసీఆర్కు నేనే చెప్పిన. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదేళ్లు బీఆర్ఎస్ను అధికారంలోకి ఉంచడంలో, హైదరాబాద్కు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన ఘనతలో కేటీఆర్ది పాత్ర ఉన్నది.
– రాజేశం గౌడ్, మాజీ మంత్రి
మూడు దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై ఉన్నం. అలాంటి ప్రజలే బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన్రు. ఇంతమంచి నాయకులు, పార్టీ కార్యకర్తలను నమ్మించి జగిత్యాల ఎమ్మెల్యే మోసం చేసిండు. పక్షికి తన రెకలపై నమ్మకం ఉంటుంది. అది నమ్మినట్టుగానే పార్టీ కూడా కార్యకర్తల బలాన్ని నమ్ముతుంది. ఐదేళ్లుగా కార్యకర్తలకు అండగా ఉన్న. బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంట.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారలేదు. సీఎం రేవంత్రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడి పార్టీ మారిండు. ఆయన వియ్యంకుడి కాంట్రాక్టు డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం, ఆయన కష్రర్ల కోసం కాంగ్రెస్లో చేరిండు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారాలి. అప్పుడే సంజయ్కుమార్ను రేవంత్రెడ్డి చేర్చుకోవాలి. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే క్రషర్లో రాళ్లు ఏరుకుంటే ఆయన వియ్యంకుడు కాంట్రాక్టుల పైసలు వెతుక్కుంటడు.
– కేటీఆర్
ఎవరు ఉన్నా.. లేకున్నా.. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల కోసం మేమున్నాం. కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ట్రం తెచ్చిండు. గులాబీ జెండాకోసం, కార్యకర్తల కోసం మేమున్నాం. నాయకులు ఏదో తప్పు చేసినట్టు ఉండడం వద్దు. మనం ఎప్పుడూ తప్పు చేయలే. ధైర్యంగా ఉండాలి. తప్పు చేసిన వారు తలదించుకుంటరు. ఈనాటి ఓటమి రేపటి గెలుపు అని నేను నమ్ముత. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా ఉన్నది. ఎన్ని చేసినా పార్టీ నుంచి పోయేవాళ్లు పోతరు. మనం మాత్రం ఇక్కడే ఉండి పోరాడుదాం. జిల్లాలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా ఉంటాం.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
మన పార్టీపై పోటీలో నిల్చుని గెలిపించుకున్నంక డబ్బుల కోసం మనందరి నోట్లో మట్టి కొట్టి పార్టీ మారడం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు సరికాదు. అందరికీ మాయ మాటలు చెప్పి డబుల్ బెడ్రూం నిధులు, కాంట్రాక్టర్ల కోసం ఇక్కడి ప్రజలను మోసం చేసి పోయిండు. వియ్యంకుడి కాంట్రాక్ట్ నిధుల కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్లిండు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఒకడితో ప్రారంభమైంది. ఇప్పుడు లక్షలు, కోట్ల మంది ఆయన వెంబడి ఉన్నారు. కార్యకర్తల వెన్నంటి ఉంటాం. మీకు సమస్య వస్తే ఒక్క ఫోన్ చేయండి. మీ ముందుంటం. తెలంగాణ తెచ్చింది మనమే. ఇప్పుడు రాష్ర్టాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
గింతమంచి కార్యకర్తలను సంజయ్ కుమార్ తన్నిపోయిండు. అలాంటి వ్యక్తిని గెలిపించడానికి మన ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత కష్టపడ్డరు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమెకు వెన్ను పోటు పొడిచి పార్టీ మారిండు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే తెలంగాణ పదేళ్లు వెనకి పోయింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో మనదే గెలుపు. మీ వెనుక మేమున్నాం. మీకు ఏ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే మీ ముందు వాలిపోతాం. రాబోయే రోజుల్లో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. తెలంగాణ కవి కాళోజీ అన్నట్లు ప్రాంతేతరుడు తప్పు చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం.. ప్రాంతం వాడు తప్పు చేస్తే పాతి పెడుతాం.
– డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల ఎమ్మెల్యే