కరీం‘నగరం’ మెరిసిపోతున్నది. స్వరాష్ట్రంలో అద్భుత నగరంగా రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రేమ, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కృషితో నయా అందాలను సంతరించుకున్నది. వేలాది కోట్ల నిధులతో దారులు, చౌరస్తాలు కొత్త సొబగులు అద్దుకోగా, వారం క్రితం ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జి మణిహారంలా వెలిగిపోతున్నది. రాత్రి వేళ ఏ వీధి చూసినా.. ఏ కూడలి చూసినా కాంతులీనుతుండగా, తీగల వంతెన వెలుగుల జిలుగుల్లో తలుకులీనుతున్నది.
– కార్పొరేషన్, జూన్ 28/ కరీంనగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్
తెలంగాణ రాక ముందు కరీం‘నగరం’ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇరుకు, అధ్వానమైన రోడ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో కళావిహీనంగా కనిపించేది. అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. నయాపైసా కూడా ఇవ్వలేదు. కానీ, స్వరాష్ట్రంలో కరీం‘నగరం’ దశ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రేమతో రాష్ట్రంలోనే రెండో నగరంగా వేగంగా ఎదుగుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి వందలాది కోట్లు మంజూరు చేయగా, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కృషితో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. స్మార్ట్సిటీగా మారి, ప్రగతి పరుగులు తీస్తున్నది.
ప్రధాన రోడ్లతోపాటు గల్లీ రోడ్లన్నీ విశాలంగా మారాయి. చౌరస్తాలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. ఇవన్నీ రాత్రి వేళ జిగేల్ మంటున్నాయి. ఏ చౌరస్తా చూసినా, ఏ రోడ్డు చూసినా విద్యుద్దీపాల వెలుగులతో కాంతులీనుతున్నాయి. 224 కోట్లతో నిర్మించిన కేబుల్బ్రిడ్జి ఈ నెల 21న ప్రారంభోత్సవం చేసుకోగా, వెలుగుల జిలుగుల్లో మెరిసిపోతున్నది. మరోవైపు 480 కోట్లతో మానేరు రివర్ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతుండగా, ఇది పూర్తయితే మానేరు తీరాన సరికొత్త కొత్త శోభరానున్నది. మొత్తంగా కరీంనగరం నయా అందాలతో కనువిందు చేస్తున్నది.