మధ్యమానేరు పరిహారం చెల్లింపుల్లో మళ్లీ అక్రమాలకు తెరలేపుతున్నారా..? పాత దందా నడిపేందుకు ప్రయత్నిస్తున్నారా..? అందులో కొంత మంది అధికారులే సూత్రధారులుగా మారుతున్నారా..? పైరవీ దారులకు సహకారం అందిస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. తాజాగా ముంపు గ్రామాల్లో ఒకటైన చింతల్ఠాణాలో లేని ఇండ్లకు బైనంబర్లు సృష్టించి, దాదాపు 2 కోట్ల పరిపహారం కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ బాగోతంలో ఏండ్లుగా పాతుకుపోయిన ఓ ఇద్దరు అధికారులే కీలకసూత్రధారులనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారం ఇప్పిస్తే వచ్చిన డబ్బుల నుంచి 50 శాతం అమౌంట్ తమకే ఇవ్వాలంటూ సదరు అధికారులు ఒప్పందాలు చేసుకుంటూ ఫైల్ను చకచకా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై నిజమైన లబ్ధిదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మధ్యమానేరు పరిహారం విషయంలో గతంలో అనేక అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ మేరకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు అనేక చర్యలు తీసుకున్నది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రావడంతో మళ్లీ కొంత మంది అధికారులు అక్రమాలకు తెరలేపుతున్నట్టు తెలుస్తున్నది. అందుకు చింతల్ఠాణా గ్రామం వేదికగా.. అక్కడ లేని కొన్ని ఇండ్లకు బై నంబర్లు సృష్టించి, దాదాపు రెండు కోట్ల పరిహారం చెల్లింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతున్నది. నిజానికి ఈ వ్యవహారం గతంలో ఉన్నతాధికారులకు దృష్టికి రావడంతో విచారించి, వాటిని బోగస్గా నిర్ధారించి పక్కన పెట్టారు. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పైరవీకారులు, ఇప్పుడు ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు మారడంతో మళ్లీ అక్రమాలకు తెరలేపుతున్నారు.
చింతల్ఠాణాకు సంబంధించి కొన్ని ఇండ్లకు బై నంబర్లు వేసి.. సదరు వ్యక్తులకు డబ్బులు ఇప్పించేందుకు ఓ ఇద్దరు అధికారులు కీలక సూత్రదారులుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ బై నంబర్ల ఇండ్ల సమాచారం గ్రామ పంచాయతీల్లో లేదని తెలిసింది. అంతేకాదు, ఒకటైన చింతలఠాణాలో ఇండ్ల పరిహారం చెల్లింపునకు 2007లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేశారు. మొత్తం 710 ఇండ్లు ఉన్నట్లుగా గుర్తించి, వాటికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టగానే అంటే.. 2014 నుంచి ముంపు గ్రామస్తులకు దశలవారీగా పరిహారం చెల్లించింది. ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే పరిహారాన్ని కాజేసిన కొంత మంది పైరవీకారులు, అధికారులు అప్పట్లో చింతల్ఠాణాలోనూ దండుకున్నట్టు బహిర్గతం కావడంతో చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మరోసారి అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. అందుకు సంబంధించి ఫైల్ను (ఎల్ఆర్ నంబర్ ఇ/30/2008/తేది 6-2024) చకచకా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిసింది. నిజానికి ప్రస్తుతం చెబుతున్న ఇండ్ల వివరాలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చిన అంచనాల్లో లేవు. ఆ విషయాన్ని పక్కన పెట్టి.. బైనంబర్ల పేరిట కొత్తవి సృష్టించి వ్యవహారం నడుపుతున్నారు. ఈ ఫైల్పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తాజాగా స్పెషల్ డిప్యూట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై విచారణ చేస్తున్న అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి, అంతా ఒకే అనేలా ఫైల్ తయారు చేయించి, కలెక్టర్ ద్వారా పరిహారం పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఏళ్లుగా పాతుకపోవడంతోపాటు ఇటువంటి వ్యహారాల్లో రాటుతేలిన ఇద్దరు అధికారులు.. ఈ అక్రమాలకు అండగా ఉండడమే కాకుండా.. వారే దగ్గరుండి ఈ బాగోతాన్ని నడుపుతున్నారనే విమర్శలున్నాయి. అందుకు గానూ సదరు వ్యక్తుల నుంచి 50 శాతం పరిహారం చెల్లింపునకు ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం.
నిజానికి మధ్యమానేరుకు సంబంధించి కోర్టుల్లో ఉన్న పిటిషన్లు, కొన్ని కుటుంబ తగాదాల వంటి వివిధ కారణాలతో కొంత మందికి పరిహారం అందలేదు. ఈ విషయం మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో పరిహారం రాని వ్యక్తుల వివరాలు పూర్తిగా సేకరించి ఇవ్వాలని అప్పటి కలెక్టర్ను ఆదేశించారు. ఆ మేరకు కలెక్టర్ ప్రత్యేకాధికారులను నియమించారు. ఆ అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపి మొత్తం 42 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఇవి చెల్లిస్తే పరిహారం చెల్లింపుల ప్రస్తావన ఇక ఉండదని తమ నివేదికలో స్పష్టం చేశారు.
ఈ సమస్యను సానుకూల దృక్పథంతో చూసిన కేటీఆర్, ప్రభుత్వం నుంచి ముందుగా 14 కోట్లు విడుదల చేయించారు. మిగిలినవి విడుదల చేయించేలోగా ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మంజూరైన 14 కోట్ల నుంచి అర్హులైన ముంపువాసులకు 8 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా మిగిలిన 6 కోట్లు ప్రభుత్వ ఖాతాలోనే ఉండిపోయాయి. దీంతో ఇప్పుడు పైరవీకారుల దృష్టి మిగిలిన ఆరు కోట్ల రూపాయలపై పడింది. ఎలాగైనా వీటిని కాజేయాలన్న లక్ష్యంతో ఒక్కో పైరవీకారుడు ఒక్కో పద్ధతిలో ముందుకు వెళ్తుండగా, చేయి తిరిగిన ఇద్దరు అధికారులు అందులో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాగా చింతల్ఠాణా నుంచి ఓ ఇద్దరు వ్యక్తులు పైరవీకారులుగా మారి ఈ దందాలో నిమగ్నం అవుతున్నట్టు తెలుస్తున్నది. పరిహారం వస్తే.. అందులో 50 శాతం ఇచ్చేందుకు వీరు ఒప్పందాలు చేయించినట్టు తెలిసింది.
ఈ విషయంలో ఏమాత్రం తొందరపడినా డబ్బులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లనుండగా, నిజమైన ముంపువాసులకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులు, ముఖ్యంగా కలెక్టర్.. ప్రత్యేక చొరవ చూపి ఈ అక్రమాలకు అడ్డు కట్టవేయాల్సిన అవసరముందన్న వాదనలు వస్తున్నాయి. అంతేకాదు, అక్రమార్కులను ప్రోత్సహిస్తున్న సదరు ఇద్దరు అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తున్నది. ఏళ్లుగా పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతూ.. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోకపోతే.. మళ్లీ ఇలాంటి పరిణామాలే పునరావృతమయ్యే ముప్పు ఉంటుంది. దీని ద్వారా నిజమైన లబ్ధిదారులు పరిహారం కోసం.. మళ్లీ నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.