జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎమ్మెస్) అవినీతికి అడ్డగా మారింది. ఏళ్ల తరబడిగా తిష్టవేసిన అధికారులు.. ప్రతి పనికో ఓ రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నట్టు బయటపడుతున్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అండగా నిలిచి ప్రొత్సహించాల్సింది పోయి వారిని కాల్చుక తింటున్నట్టు బహిర్గతమవుతున్నది. కొన్నాళ్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, తాజాగా సొసైటీ బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో అవినీతి తిమింగళాల బాగోతం బట్టబయలైంది. వీరి అక్రమాలకు ఒక్క కావటి రాజు మాత్రమే కాదు, 75 శాతం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇదే తరహాలో ఇబ్బందులు పడినట్టు వెలుగులోకి వస్తున్నది. అంతేకాదు, వీరి వ్యవహారం నచ్చక చాలా మంది నిర్వాహకులు నష్టాన్ని భరించి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. డీసీఎమ్మెస్లో జరిగే అక్రమాల వెనుక వెంకటేశ్వర్రావు హస్తమే ఉందనే విమర్శలు వస్తుండగా, తాజాగా హుజూరాబాద్ డీసీఎమ్మెస్ కాంప్లెక్ లీజుదారులు.. డీసీవోను కలిపి ఫిర్యాదు చేయడం వెంకటేశ్వర్రావు అవినీతికి అద్దంపడుతున్నది.
కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ముకరంపుర : అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతూరులోనే మద్దతు ధరకు సకాలంలో ధాన్యం విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సంఘాలతో పాటు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎమ్మెస్) గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా అన్ని విభాగాలు కలిపి సుమారు 1300లకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో 200 పైచిలుకు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం సెంటర్ నిర్వాహకులను నియమించి కార్యకలాపాలు నడుపుతున్నారు.
డీసీఎమ్మెస్ కొన్న ధాన్యానికి పౌరసరఫరాల శాఖ క్వింటాలుకు 32చొప్పున కమీషన్ అందిస్తుంది. అందులో 16 డీసీఎమ్మెస్కు, మిగిలిన 16 కేంద్రం నిర్వాహకులకు చెల్లించాలి. వచ్చే ఈ కమీషన్తోనే సెంటర్ వద్ద సుతిల్ దారం నుంచి తాగునీటి సౌకర్యం వరకు కల్పించాలి. పౌరసరఫరాల శాఖ ద్వారా వచ్చే గన్నీ బ్యాగులను దించుకునేందుకు హమాలీ చార్జీలు చెల్లించాలి. లారీలు వచ్చినప్పుడు లోడింగ్ ఆలస్యం జరిగితే సంబంధిత డైవర్లకు భోజనాలు పెట్టించాలి. తూకాలు వేయడం, లోడింగ్ చేయడం వంటి వాటిని పరిశీలనకు ఒక బుక్కీపర్, మూమెంట్ రిజిస్ట్రేషన్కు ఒకరు, ట్రక్షీట్, రైతులకు రసీదులు, మిల్లులకు తీసుకెళ్లి రైతులతో జాయింట్ ఆగ్రిమెంట్ వంటి పనులు చేయడానికి మరికొందరు వ్యక్తులను నియమించుకొని.. వారికి వేతనాలు ఇవ్వాలి. ఇవే కాకుండా ఏటా తూనికలు కొలతల శాఖాధికారులు వచ్చి వేసే ముద్రలకు స్టాంప్ డ్యూటీని నిర్వాహకులే చెల్లించాలి. ఇలా సెంటర్ వద్ద జరిగే ప్రతి ఖర్చునూ భరించాలి. కానీ, డీసీఎమ్మెస్కు మాత్రం ఏ ఖర్చు ఉండదు. వచ్చిన 16 కమీషన్ నేరుగా సంస్థకు మిగులుతుంది. నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే క్వింటాలుకు 16 కమీషన్ వస్తే.. అందులో ఖర్చు 10 నుంచి 11 వరకు వస్తుంది. అంటే క్వింటాలుపై సెంటర్ నిర్వాహకులకు మిగిలేది కేవలం 4 నుంచి 5 వరకే ఉంటుంది.
నిజానికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎంత బాగా పనిచేస్తే అంత ధాన్యం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. తద్వారా డీసీఎమ్మెస్కు కమీషన్ అధికంగా రావడానికి ఆస్కారముంటుంది. దీంతో సెంటర్ నిర్వాహకులు బాగుపడుతారు. కానీ, డీసీఎమ్మెస్లో మాత్రం ఇది పూర్తి విరుద్ధం. పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చిన కమీషన్లో సగం డీసీఎమ్మెస్ ఉంచుకొని.. మిగిలిన సగాన్ని ఎప్పటికప్పుడు సెంటర్ నిర్వాహకులకు చెల్లించి వారిని మరో సీజన్కు సన్నద్ధం చేయాలి. కానీ, ఈ కార్యాలయంలో తిష్టవేసిన బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్రావు ఇతర అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఏసీబీకి పట్టుబడడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. డీసీఎమ్మెస్ కొన్నేళ్లుగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తిలో కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. ఇదే గ్రామానికి చెందిన కావటి రాజుకు కొనుగోలు కేంద్రం బాధ్యతలు అప్పగించింది. 2018-19 నుంచి 2023-24 వానకాలం సీజన్ వరకు 5.26లక్షల క్వింటాళ్ల ధాన్యం ఈ సెంటర్లో కొనుగోలు జరిగింది. 2019-20లో 55వేల క్వింటాళ్ల మక్కల కొనుగోలు జరిగింది. వీటికి సంబంధించి సివిల్ సైప్లె శాఖ డీసీఎమ్మెస్కు క్వింటాల్కు 32చొప్పున కమీషన్ ఇచ్చింది. అందులో 16 డీసీఎమ్మెస్ ఉంచుకొని.. మిగిలిన 16 సెంటర్ నిర్వాహకులకు చెల్లించాలి. నిజానికి ఎప్పటికప్పుడు వచ్చిన కమీషన్ చెల్లించి అండగా నిలువాలి. కానీ, అధికారులు కమీషన్ ఇవ్వకుండా ఏళ్ల తరబడిగా పెడింగ్ పెడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వారికే కమీషన్ ఇస్తున్నారు. లేదంటే కుంటి సాకులు చెప్పి నిర్వాహకులను ముప్పుతిప్పులు పెడుతున్నారు. ఇందుర్తి కేంద్రం నిర్వాహకుడు కావటి రాజుకు సుమారు 60లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నా.. వాటిని పెడింగ్లోపెట్టారు.
తమ సెంటర్కు రావాల్సిన కమీషన్ను చెల్లించాలని నిర్వాహకులు రాజు కొన్నేళ్లుగా డీసీఎమ్మెస్ అధికారులకు మొర పెట్టకుంటున్నా కనికరం చూపలేదు. చివరకు అధికారులు తమదైన వ్యూహం రచించారు. బాధితుడిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కమీషన్ ఇవ్వడానికి కుదరదని, వాటికి సరిపోయేలా ఎరువులు సరఫరా చేస్తామని చెప్పి, రాజుతో ఇందుర్తిలో ఓ ఎరువుల దుకాణం పెట్టించారు. దానికి సైతం రాజు ఒప్పుకున్నాడు. ఆ మేరకు డీసీఎమ్మెస్ మేనేజర్ కొద్ది రోజుల క్రితం రాజుకు నాలుగు లారీల ఎరువులను పంపించాడు. అయితే అందులోనూ అవినీతిని ప్రదర్శించారు. బహిరంగ మార్కెట్లో 28-28 అనే ఎరువు బస్తా 1555కు లభిస్తుండగా.. అధికారులు మాత్రం 1580 రేటు వేసి రాజుకు సరఫరా చేసినట్టు ఏసీబీ ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. అందులోనూ కమీషన్ను దండుకున్నట్టు తెలుస్తున్నది.
ఏదో రూపంలో తమ కేంద్రానికి రావాల్సిన కమీషన్ వస్తే చాలనుకున్న రాజు ఎరువుల బస్తాలను తీసుకునే క్రమంలో ప్రతి లారీకి రూ.లక్ష చొప్పున చెల్లించాలంటూ మేనేజర్ మళ్లీ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని అశ్రయించగా, లక్ష లంచం తీసుకుంటుండగా బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్రావుతోపాటు మరో అధికారి రెడ్హ్యాడెండ్గా పట్టుబడ్డారు. వెంకటేశ్వర్రావు డీసీఎమ్మెస్లో పాతుకుపోయాడు. ఆయన కనుసన్నల్లోనే కార్యకలాపాలు జరిగేవి. పాలకవర్గాలకు కూడా ఆయన చెప్పిందే వేదం. దీంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆయన పాపం పండిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన గురువారం ఏసీబీకి చిక్కిన విషయం తెలిసి చాలా మంది సెంటర్ నిర్వాహకులు ఏకంగా సంబరాలు చేసుకుంటున్నారు.
వెంకటేశ్వర్రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హుజూరాబాద్లోని 20 మంది డీసీఎమ్మెఎస్ కాంప్లెక్స్ లీజుదారులు శుక్రవారం డీసీవో రామానుజచార్యులను కలిసి ఫిర్యాదు చేశారు. అద్దె విషయంలో వెంకటేశ్వరావు నియంతలా వ్యవహరించాడని, నిబంధనలకు విరుద్ధంగా.. ఇష్టారాజ్యంగా అగ్రిమెంట్లు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేంటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని, లేదంటే కోర్టుకుపో అని వ్యంగ్యంగా మాట్లాడేవాడని వాపోయారు. బహిరంగ వేలంలో షట్టర్ పొందిన తమను ముప్పుతిప్పలు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరావు చేసిన దుర్మార్గపు పనులకు చాలామంది దుకాణాదారుల బతుకులు రోడ్డున పడ్డాయని చెప్పారు. విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో లీజుదారులు మురికి అనిల్కుమార్, కొమురా మల్లారెడ్డి, గోలి దివాకర్, యాంసాని చంద్రమొగిలి,మూషం వెంకటనారాయణ పాకాల రవీందర్రెడ్డి, స్వర్గం లక్ష్మీనారయణ, తలకొక్కుల శ్రీకాంత్లతోపాటు మరో 15మంది ఉన్నారు.