విద్యానగర్, జూన్ 30 : ఆమె పేదింట్లో పుట్టింది. ప్రభుత్వం కల్పించిన విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని మెడిసిన్ వరకు చదివింది. వైద్యుడైన తండ్రి బాటలో నడిచింది. ప్రభుత్వ వైద్యురాలిగా పేదలకు ఎనలేని సేవలు అందించింది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా చిన్న క్లినిక్ పెట్టుకుని పేదలకు సేవలు అందిస్తున్న ఆమె, కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి తిరిగి సేవలు అందిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన ఎవరికైనా తానున్నానని ధైర్యం చెబుతూ, ఇప్పటికీ హైరిస్క్ కేసులకు అటెండ్ అవుతూ ఎన్నో ప్రాణాలను నిలబెడుతూ నేటితరం మహిళా వైద్యులకు ఆదర్శం నిలుస్తున్న డాక్టర్ సుహాసినిపై డాక్టర్స్ డే సందర్భంగా కథనం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డాక్టర్ సుహాసిని పేరు వినని వారుండరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సుహాసిని ప్రాథమిక, ఉన్నత విద్య అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్ కూడా అక్కడి కళాశాలోనే పూర్తి చేశారు. 1988లో ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎంట్రెన్ రాసి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మూడేళ్ల పాటు అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. ఆ తర్వాత పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ వైద్యురాలుగా నియమితులయ్యారు. 1997లో మొదటి పోస్టింగ్ వచ్చిన ఎల్ఎండీ కాలనీలోని ఏరియా దవాఖానలో ఏడాది పాటు విధులు నిర్వహించిన సుహాసిని, 1998లో వైద్య విధాన పరిషత్తుకు వచ్చి, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో గైనకాలజిస్టుగా సేవలు అందించారు. తన 23 ఏండ్ల సర్వీసులో 21 ఏండ్లు ఇదే దవాఖానలో విధులు నిర్వహించిన ఏకైన వైద్యురాలు సుహాసిని.
ఉద్యోగ విరమణ తర్వాత డాక్టర్ సుహాసిని కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండే ప్రభుత్వ దవాఖానల్లో చాలా కాలం పాటు ఒకే ఒక గైనకాలజిస్టుగా పని చేశారు. రోజుకు 25 నుంచి 30 ప్రసవాలు చేసే వారు. ఒక్కో నెలలో 300-400 చేసేవారు. కరీంనగర్లో ఎంసీహెచ్ నెలకొల్పిన తర్వాత ఈ ప్రసవాలను మరింత పెంచారు. నెలలో 800 నుంచి 900 ప్రసవాలు జరిపి రికార్డు సృష్టించారు. ఈమె సర్వీసులో మొత్తంగా లక్షకుపైగా ప్రసవాలు చేసినట్లు చెబుతున్నారు. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకైతే లెక్కే లేదు. 24 గంటలు దవాఖానలోనే గడిపేవారు. ఏ రాత్రి ఎలాంటి రోగులు వచ్చినా నేనున్నానని వచ్చి ప్రాణాలు కాపాడేవారు. మూడేండ్ల పాటు సూపరింటెండెంట్గా, రెండేళ్ల పాటు డీసీహెచ్ఎస్గా సేవలు అందించిన ఆమె హయాంలోనే ప్రభుత్వ దవాఖానలో అనేక మార్పులు జరిగాయి.
ఐసీయూ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మిడ్వైఫరీ కోర్సులు వంటి అనేక సదుపాయాలు వచ్చాయి. టీహబ్ ఏర్పాటుకు ఈమె ఆధ్వర్యంలోనే రూపకల్పన జరిగింది. పేదల డాక్టర్గా ముద్ర పడిన సుహాసిని ముఖ్యంగా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె రాకముందు కేవలం 20 శాతం కూడా జరుగని నార్మల్ డెలివరీలు ఆ తర్వాత 40 శాతానికి పెరిగాయి. సుహాసిని అనుసరించిన విధానంతోనే రాష్ట్రంలోనే కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు మంచి పేరు వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత సుహాసిని ఇప్పుడు చిన్నక్లినిక్ పెట్టుకుని పేదలకు సేవలకు సేవలు అందిస్తూనే మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా తిరిగి ప్రభుత్వ సేవల్లోకి రావడం ఆమెకు వైద్య వృత్తిపై ఉన్న మక్కువకు నిదర్శనం. నేటి తరం మహిళా వైద్యులు ఎందరికో సుహాసిని ఆదర్శనీయం.