Telangana | మళ్లీ కడుపు కోతలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సీ సెక్షన్ ఆపరేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పదేళ్లపాటు ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించినా.. ఆరు నెలల నుంచి పరిస్థితులు మారిపోయాయి. పర్యవేక్షణ కరువై మళ్లీ ప్రైవేట్లో డెలివరీలు పెరుగుతుండగా, అందులోనూ ఎక్కువగా సిజేరియన్లే ఉంటున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాను చూస్తే.. గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రైవేట్లో 1999 కాన్పులు అయితే.. అందులో 1706 ఆపరేషన్ల ద్వారానే కావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను ప్రోత్సహించకుండా.. ఉన్నతాధికారులు చోద్యం చూడడం విమర్శలకు తావిస్తున్నది. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలంటే నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని, కడుపుకోతలకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, మే 30 (నమస్తే తెలంగాణ): వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మానవ జాతికి ముఖ్యంగా మహిళలకు సాధారణ ప్రసవాలే మంచివి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా ఉండగా, ప్రభుత్వాలు సైతం సాధారణ ప్రసవాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అయితే సాధారణ ప్రసవాలకు భిన్నంగా సెక్షన్ల ద్వారా ప్రసవాలు అధికంగా జరుగుతున్న దేశాల్లో భారత దేశం ఒకటి కాగా, అధిక ప్రసవాలు జరుగుతున్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. ఇక తెలంగాణలో అత్యధికంగా ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు నమోదవుతున్న ప్రాంతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తల్లిబిడ్డల క్షేమానికి సాధారణ ప్రసవాలే ముఖ్యమని, ఆపరేషన్ల ద్వారా పుట్టే బిడ్డలకు, అలాగే ఆపరేషన్ల వల్ల తల్లులకు శారీరక రుగ్మతలు వస్తున్నాయని గతంలో హూ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం ప్రసవాల కోసం చేస్తున్న ఆపరేషన్ల సంఖ్యను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని పలు చర్యలను చేపట్టింది. అమ్మలాలన పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రసవం, పుట్టిన బిడ్డకు 12వేల ప్రోత్సాహకం, 13 వస్తువులతో కేసీఆర్ కిట్ను ఇచ్చింది. వీటితో పాటు ఆశా వర్కర్లకు లక్ష్యాలను నిర్దేశించి వారి పరిధిలో గర్భిణులను గుర్తించి వారిని ప్రభుత్వ దవాఖానలకు ప్రసవాల కోసం వచ్చేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రైవేట్ నర్సింగ్ హోంలపైన సైతం ఆంక్షలు విధించింది. వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని, విధిలేని పరిస్థితుల్లోనే సెక్షన్లు చేయాలని ఆదేశించింది. నర్సింగ్ హోమ్స్ల్లో కనీసం 30 శాతం ప్రసవాలు సాధారణ ప్రసవాలు ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఫలించాయి.
ఎనిమిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించిన ఏడాదిలో ప్రసవాల సంఖ్యను పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తం 7,257 ప్రసవాలు జరుగగా, అందులో 5,123 ప్రసవాలు ప్రైవేట్ దవాఖానల్లోనే నమోదయ్యాయి. కేవలం 2,134 ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయి. అంటే 70 శాతానికిపైగా ప్రైవేట్లోనే నమోదయ్యాయి. అందులోనూ సాధారణ ప్రసవాలు ప్రైవేట్లో 573 కాగా, 4,550 ఆపరేషన్ల ద్వారానే జరిగాయి. ఇక ప్రభుత్వ వైద్యశాలల్లో 758 సాధారణ ప్రసవాలు కాగా, 1376 ఆపరేషన్లు అయ్యాయి. అంటే ప్రైవేట్లో 88 శాతం మేర ప్రసవాలు ఆపరేషన్ల ద్వారానే జరిగాయి.
జగిత్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రసవాల విషయంలో మార్పు మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అప్పడు తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శరత్, జిల్లా ఉన్నతాధికారుల కృషి ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడం మొదలైంది. 2017-18లో జిల్లా వ్యాప్తంగా 15,407 ప్రసవాలు జరిగితే.. ప్రభుత్వ దవాఖానల్లో 9,850 ప్రసవాలు (65 శాతం) నమోదయ్యాయి. 2018-19లో 12,110 ప్రసవాలు కాగా, 7,826 ప్రసవాలు (65 శాతం) గవర్నమెంట్లోనే జరిగాయి. 2019-20లో మొత్తం 13,005 ప్రసవాలు జరిగితే, ప్రభుత్వ దవాఖానల్లో 8262 జరిగాయి. 2020-2021లో 12,626 ప్రసవాలు జిల్లాలో జరుగగా, అందులో 6,576 ప్రసవాలు గవర్నమెంట్లోనే జరిగాయి. అయితే మహమ్మారి కరోనా టైంలో మాత్రం ప్రభుత్వ దవాఖానల్లో కొంత మేరకు ప్రసవాల సంఖ్య తగ్గిపోయింది. కరోనా అనంతరం ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య కొంత మెరుగైనప్పటికీ, ప్రైవేట్లోనూ ప్రసవాల సంఖ్య పెరగడం ఆరంభమైంది.
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో కొన్నేండ్ల పాటు ప్రసవాలు పెరుగుతూ వచ్చాయి. అయితే కొన్నాళ్లుగా మాత్రం ప్రసవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 52 శాతం ప్రసవాలు నమోదు కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 48 శాతం ప్రసవాలు నమోదయ్యాయి. అయితే 2023 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మళ్లీ ప్రైవేట్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య, ఆపరేషన్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతూ వస్తున్నది. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వ దవాఖానల్లో 586 ప్రసవాలు కాగా, ప్రైవేట్లో 592 నమోదు అయ్యాయి. ఇక ఈ యేడాది జనవరి నుంచి మరింత పడిపోతున్నాయి. జనవరిలో ప్రభుత్వ దవాఖానల్లో 505 ప్రసవాలు నమోదు కాగా, ప్రైవేట్లో 513 జరిగాయి. ఫిబ్రవరిలో ప్రభుత్వ దవాఖానల్లో 412, ప్రైవేట్లో 439, మార్చిలో ప్రభుత్వ దవాఖానల్లో 424, ప్రైవేట్లో 452 ప్రసవాలు జరిగాయి. ఇక ఏప్రిల్లో ప్రభుత్వ దవాఖానల్లో 504 ప్రసవాలు నమోదు కాగా, ప్రైవేట్లో 595 నమోదయ్యాయి. మొత్తంగా డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ వరకు ప్రభు త్వ దవాఖానల్లో 2431 ప్రసవాలు (48శాతం)జరుగగా, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల్లో 2,591 ప్రసవాలు(52శాతం) నమోదయ్యాయి.
ప్రైవేట్లో ప్రసవాల్లో 87 శాతం కడుపుకోతల ద్వారానే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లా ఏర్పడిన తర్వాత రెండు మూడేండ్ల పాటు ప్రైవేట్ దవాఖానలు అధికారుల భయానికి సాధారణ ప్రసవాల వైపు మొగ్గు చూపగా, తర్వాత కాలంలో మళ్లీ కడుపు కోతల వైపే మళ్లారు. ఇక కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింతగా పెరిగిపోయింది. గతేడాది డిసెంబర్, ఈ యేడాది ఏప్రిల్ వరకు ప్రైవేట్లో 1999 ప్రసవాలు జరుగగా, అందులో కేవలం 293 ప్రసవాలు మాత్రమే సాధారణ ప్రసవాలు కాగా, మిగిలిన ప్రసవాలన్నీ కడుపుకోతల ద్వారానే జరుగుతుండడంపై వైద్యరంగ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రైవేట్ దవాఖానల్లో జరిగే అనవసర కడుపుకోతలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.