కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాజకీయాలకు అతీతంగా రైతులకు సహకార సేవలు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి తాను జోడెద్దుల్లా సహకార రంగంలో పనిచేశామని గుర్తు చేశారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలని అనుకున్న తనకు 15 రోజుల్లోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి మార్క్ఫెడ్ చైర్మన్గా అవకాశం కల్పించారని గుర్తు చేశారు.
ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యానని, ఇప్పుడు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, తమ పార్టీ అధికారంలోకి రావడం తద్వారా మంత్రి పదవి వచ్చిందని చెప్పారు. తాను ఎంత ఎత్తుకు వెళ్లినా సహకార రంగం నుంచి మొదలైన తన రాజకీయ ప్రస్థానాన్ని మాత్రం ఎన్నటికీ మరిచిపోనని స్పష్టం చేశారు. ఒక రైతుగా తన తండ్రి పండించిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు అనేక కష్టాలు పడేవారని గుర్తు చేశారు. ఇప్పుడు సహకార రంగం ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేలా జీవోలను తామే ఇచ్చామన్నారు.
సహకార రంగంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజకీయాలు వేరు, సహకార సేవలు వేరని గుర్తించాలని కోరారు. సహకార రంగం ద్వారా సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కేడీసీసీబీ చైర్మన్ రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పింగలి రమేశ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, సీఈఓ సత్యనారాయణ, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ను చైర్మన్, డైరెక్టర్లు, బ్యాంకు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.