గోదావరిఖని, జూలై 3: నల్లనేల వేడెక్కుతున్నది. బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల ఆందోళనతో అట్టుడికిపోతున్నది. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 1న అన్ని బొగ్గు గనులపై కార్మికుతో నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టగా, బుధవారం సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1,2,3లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ దిష్టి బొమ్మలు దహనం చేశారు.
గోదావరిఖని చౌరస్తాలో టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపెల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన టీబీజీకేఎస్ అధ్యక్షడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి కార్మికులు, నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇక రామగుండం డివిజన్-2లోని యూనియన్ కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆర్జీ-2 డివిజన్ ఉపాధ్యక్షుడు అయిలీ శ్రీనివాస్, సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పెట్టుబడిదారులతో కుమ్మకై బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు వేగంగా పనిచేస్తున్నయి. బొగ్గు గనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ ప్రారంభిస్తే.. ఖనిజ సంపదను సంపన్న వర్గాలకు కారు చౌకగా వెలికి తీసుకునేందుకు మోడీ నేతృత్వంలో బీజేపీ చట్టాలను రూపొందించింది.
తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణి సంస్థ మాత్రమే తవ్వి తీయాలి. ఇతర ఏ ప్రైవేట్ వ్యక్తులకు గనులను కేటాయించినా అడ్డుకొని తీరుతం. తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చే సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు, ప్రజలు, రాజకీయ పార్టీలు తమ విభేదాలను మరిచి ఐక్యంగా ముందుకు రావాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు