పెద్దపల్లి, జూలై 20 (నమస్తే తెలంగాణ): ‘పెద్దపల్లి జిల్లా చాలా చైతన్యం కలిగిన జిల్లా. ఇక్కడి ప్రజలు మాటల్లో కాదు చేతల్లో చూపుతారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్ప టికే జిల్లాకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ జిల్లాలో స్థానిక సంస్థల కలెక్టర్గా పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. అందరికీ అందుబాటులో ఉంటా. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, ప్రజల సహకారంతో ముందుకెళ్తా. మరింత కష్టపడి స్వచ్ఛతే లక్ష్యంగా పనిచేస్తా’ అని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె, గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రేత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: మొదటిసారి అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఎలా ఫీలవుతున్నారు?
అదనపు కలెక్టర్: పెద్దపల్లి జిల్లా ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ప్రజాప్రతినిధులు ప్రజా సేవపై చిత్తశుద్ధి కలిగిన వాళ్లు. అధికారులు బాగా పనిచేస్తున్నారు. అందుకే పెద్దపల్లి జిల్లా ఇప్పటికే అనేక జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. అలాంటి జిల్లాలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఫీలవుతున్నా.
నమస్తే: మీ ప్రాధామ్యాలు ఎలా ఉండబోతున్నాయి?
అదనపు కలెక్టర్: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పల్లెలు, పట్టణాల డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు గ్రామాలు పట్టణాల స్థితి గతులను పూర్తిగా మార్చివేశాయి. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకే జిల్లాకు ఒక స్థానిక సంస్థల ప్రత్యేక కలెక్టర్ను నియమించారు. ఆ బాధ్యతల్లో నేను సంపూర్ణంగా అందరి సహకారంతో ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రాధామ్యాలుగా పనిచేస్తా.
నమస్తే: ఇప్పటి వరకు మీరు ఏయే బాధ్యతల్లో పనిచేశారు?
అదనపు కలెక్టర్: 2012లో స్టేట్ సర్వీస్లో చేరా. పశ్చిమ గోదావరి జిల్లాలో అమలాపురం ఆర్టీవోగా పనిచేశా. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, మంచిర్యాలలో ల్యాండ్ అక్విజేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల జడ్పీ సీఈవోగా పనిచేశా.
నమస్తే: మీ జాబ్, ఫ్యామిలీ నేపథ్యం?
అదనపు కలెక్టర్: నేను ఎన్ఐటీ వరంగల్లో చదివా. అమెరికాలో కొన్నాళ్లు పనిచేశా. సివిల్స్ పై ఆసక్తితో వెనక్కి వచ్చా. నా భర్త కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్. ఆయన నేను కలిసి ఉట్నూరులో పనిచేసిన తర్వాతే వివాహం చేసుకున్నాం. మా డాడీ సత్యనారాయణ స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ వరలక్ష్మి గృహిణి. సోదరి అమెరికాలో ఉంటున్నది.
నమస్తే: స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ఏం చేయబోతున్నారు?
అదనపు కలెక్టర్: స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాకింగ్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలంటే పారిశుధ్య నిర్వహణ పకాగా జరగాలి. ఆ దిశగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీకార్యదర్శులు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజలను మరింత చైతన్య వంతం చేస్తూ స్వచ్ఛతలో ముందుకు సాగుతాం.
నమస్తే: సీజనల్ వ్యాధులను ఎలా కట్టడి చేస్తారు?
అదనపు కలెక్టర్ : రోజు వారి పారిశుద్ధ్య సేవలకు ఆటంకం లేకుండా చూస్తున్నాం. అవసరమై చోట బ్లీచింగ్ చల్లిస్తున్నాం. దోమల నివారణకు ఫాగింగ్, రసాయనాల పిచికారీ, మురుగు నిల్వకుండా పారిశుధ్య పనులు చేపడుతున్నాం. ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు పాటించాలి. మురికి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి.
నమస్తే: పెద్దపల్లితో ఏమైనా అనుబంధం ఉన్నదా..?
అదనపు కలెక్టర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పనిచేస్తున్న సమయంలో కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణం జరుగుతున్నది. ఆసమయంలో ఇక్కడికి వచ్చి లక్ష్మీ,సరస్వతీ,పార్వతీ బరాజ్లను చూ శా. చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు స్థాని క సంస్థల అదనపు కలెక్టర్గా పెద్దపల్లికి వచ్చా.