ఉమ్మడి జిల్లాలో మిల్లర్ల అక్రమ దందా ఆగడం లేదు. సీఎమ్మార్ పేరిట అక్రమాలకు బ్రేక్ పడడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్న తీరు.. రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారుల దాడుల్లో బట్టబయలైంది. కేవలం రెండు మిల్లుల్లోనే 4.15 లక్షల క్వింటాళ్ల పైచిలుకు ధాన్యం మాయమైనట్టు గుర్తించి, వాటి విలువ 130.95 కోట్లకుపైగా ఉన్నట్టు నిర్ధారించారు. అధికారుల ఫిర్యాదు మేరకు జమ్మికుంట మండలం కోరపల్లి శివారులోని మహాశక్తి రైస్మిల్, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానులపై పోలీస్ ష్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ యజమానులే మరిన్ని మిల్లులు నడుపున్నట్టు తెలుస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో అందులోనూ కేవలం ఈ రెండు మిల్లుల్లోనే ఇంత భారీ మొత్తంలో అక్రమాలు వెలుగు చూడడం కలకం రేపుతున్నది. మరోవైపు ఈ దందాపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లోతుగా ఆరాతీస్తూ.. పూర్తి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జమ్మికుంట: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పలువురు మిల్లర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఆర్ ధాన్యం అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారుల బృందం కూడా పలుసార్లు ఆకస్మిక దాడులు చేస్తూ వచ్చింది. కొన్ని కారణాలు, ఒత్తిళ్ల మేరకు అధికారులు కొందరి అక్రమాలను చూసీచూడనట్టు వదిలేయగా.. ఇదే అదునుగా కొంత మంది మిల్లర్లు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
తమ దందాలను నడుపుతున్న తీరుపై మళ్లీ ఫిర్యాదులు వెల్లువెత్తగా.. రాష్ట్ర సివిల్ సైప్లె కమిషనర్ ఆదేశాలతో స్టేట్ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పలు రైస్మిల్లులపై ఆకస్మికంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. జమ్మికుంట మండలం కోరపల్లి శివారులోని మహాశక్తి రైస్మిల్, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్లో అధికారులు దాడులు చేయగా, సీఎంఆర్ ధాన్యం విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఆ మేరకు నివేదిక తయారు చేసి రాష్ట్ర సివిల్ సైప్లె కమిషనర్కు శుక్రవారం రాత్రే పంపినట్టు తెలిసింది. విషయాన్ని సీరియస్గా తీసుకున్న కమిషనర్, సంబంధిత యజమానులపై కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎమ్మార్ ధాన్యం భారీగా గోల్మాల్ అ యిన విషయాన్ని గుర్తించిన అధికారులు, సద రు యజమానులపై వేర్వేరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లి శివారులోని మహాశక్తి రైస్మిల్లులో 1,96, 620.14 క్వింటాళ్ల వడ్లను మిల్లింగ్ కోసం సీఎమ్మార్ కింద అప్పగిస్తే.. ఆ వడ్లను బియ్యంగా మార్చి సొమ్ముచేసుకొని ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని, దీని విలువ 62,20,64.821 ఉందంటూ జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ జమ్మికుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సదరు యజమానులు బండారి మారుతి-శారదపై 406, 409, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలోని సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్లో ఇదే తరహా దందా జరిగినట్టు అధికారులు గుర్తించారు.
ఈ మిల్లులో 2,19,038.23 క్వింటాళ్ల ధాన్యం అప్పగిస్తే సదరు వడ్లను బియ్యంగా మార్చి అమ్ముకున్నారని, వాటి విలువ 68,75,22.436గా ఉందని నిర్ధారించారు. తర్వాత ఇల్లందకుంట పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయగా.. సదరు ఓనర్లపై కేసు నమోదు చేశారు. అంటే రెండు మిల్లులను కలిపి చూస్తే 4,15,658.37 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన బియ్యం మాయమైనట్టుగా అధికారులు గుర్తించారు. వీటి విలువ 130.95 కోట్లకుపైగా ఉందని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి గతంలోనే అనేక మిల్లుల్లో సీఎమ్మార్ ధాన్యం అమ్ముకున్నట్టు అక్రమాలు వెలుగు చూసినా.. వాటి విలువ ఇంత పెద్ద మొత్తంలో లేదు. కేవలం రెండు మిల్లుల్లో 130 కోట్లకుపైగా అక్రమాలు జరగడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే ప్రథమమని మిల్లర్లు చెబుతున్నారు.
తాజా వ్యవహారం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా మిల్లర్లలో కలకలం సృష్టిస్తున్నది. మరోవైపు రెండు మిల్లుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడడంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నట్లుగా తెలుస్తున్నది. ఈ దందా రెండు మిల్లులకే పరిమితమైందా..? లేక మిగిలిన మిల్లుల్లో ఉందా..? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరిన్ని తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుండగా, కొంతమంది మిల్లర్లే ఈ అక్రమాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు మరో 12 మిల్లుల్లోనూ ఇదే తరహా దందా జరిగిందని ఫిర్యాదు చేయడమే కాకుండా.. వాటి పేర్లు, పూర్తి వివరాలు కూడా రాష్ట్ర సివిల్ సైప్లె కమిషనర్కు ఇచ్చినట్టు తెలిసింది. వరుస దాడులు చేసి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా.. కఠినంగా శిక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది.